మధ్యాహ్న భోజన పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

– ప్రజా సంఘాల నాయకులు కాన్గుల వెంకటయ్య
– ఐదవ రోజుకు చేరుకున్న మధ్యాహ్న
– భోజన పథకం కార్మికుల నిరవధిక సమ్మె
నవతెలంగాణ-ఆమనగల్‌
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల నాయకులు కాన్గుల వెంకటయ్య డిమాండ్‌ చేశారు. పనికి తగ్గ వేతనం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమనగల్‌ కడ్తాల్‌ మండల కేంద్రాల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరవధిక సమ్మె దీక్షా శిబిరాన్ని సోమవారం ప్రజా సంఘాల నాయకులు కాన్గుల వెంకటయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అదనంగా బడ్జెట్‌ కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆమనగల్‌ కడ్తాల్‌ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అందరు పాల్గొన్నారు.