వంద రోజుల పాలనపై ప్రజలు పండుగ చేసుకోవాలి

– ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వ వంద రోజుల పాలనపై పండుగ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ సీనియర్‌ నేత బెల్లయ్య నాయక్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తున్నదన్నారు. క్యాబినెట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు స్థానం కల్పించిందన్నారు. ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసి గౌరవించిందని గుర్తుచేశారు. ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎం రెండుకండ్లలా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, గ్రూప్‌ 1,2,3 పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇప్పుడు టెట్‌ కూడా డీఎస్సీ కంటే ముందే నిర్వహించేలా జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.