నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రోడ్డు భద్రత నియమాలను ప్రజలందరూ పాటించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. బుధవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో స్టాపర్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని విరాళంగా ఇచ్చిన 20 స్టాపర్లను అతిధుల సమక్షంలో ప్రారంభించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున ట్రాఫిక్ సిఐ విజ్ఞప్తి మేరకు అడిగిన వెంటనే 20 అత్యంత నాణ్యత కలిగిన స్టాపర్లను అగర్వాల్ ఓం ప్రకాష్, వారి కుమారులు జిల్లా పోలీసు వ్యవస్థకు అందజేశారు. ఈ స్టాపర్లు దాదాపు 3 లక్షల విలువ చేసేదిగా ఉంటాయని ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్ ద్విచక్ర వాహనంపై, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపవద్దు
సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపవద్దని, అతివేగం ప్రాణాలకు హానికరం అనే విషయాలను తెలియజేస్తూ ఉన్న 20 స్టాపర్లను ఆవిష్కరించారు. ఈ స్టాపర్లను రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ట్రాఫిక్ నియంత్రణకై వినియోగించాలని సూచించారు. స్టాపర్లను అందజేసిన అగర్వాల్ కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సమాజ సేవలో ముందుంటూ తనకంటూ పట్టణంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన అగర్వాల్ ఓం ప్రకాష్ వారి కుటుంబ సభ్యులకు శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అమిత్ అగర్వాల్, గజానంద్ అగర్వాల్, పట్టణ సీఐలు సునీల్, కరుణాకర్, ప్రణయ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.