టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు

– 2017లో ఎంపికైన వారికి పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌
– టీఎస్‌పీఎస్సీ స్పందించకపోవడంపై ఆగ్రహం
నవతెలంగాణ -సుల్తాన్‌బజార్‌
గురుకులాల్లో 2017లో విడుదల చేసిన పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. అభ్యర్థులను అరెస్టు చేసి అబిడ్స్‌, నాంపల్లి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌లో బైటాయించిన కొంతమంది అభ్యర్థులు మాట్లాడుతూ.. తమకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2017 సంవత్సరంలో విడుదల చేసిన గురుకుల పీఈటీ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో 616 పోస్టులతో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష రాసిన 1232 మందిని ఎంపిక చేశారని తెలిపారు. మధ్యలో కోర్డు కేసులతో వాయిదా వేస్తూ ఆరు సంవత్సరాలు కాలయాపన చేశారన్నారు. ఇటీవల కోర్టు కేసు పూర్తి అయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ స్పందించటం లేదని వాపోయారు. వెంటనే 616 పోస్ట్‌లను భర్తీ చేయాలని, లేదంటే ఇక్కడే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.