హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు

– జీహెచ్‌ఎంసీని సందర్శిచిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందం
నవతెలంగాణ – సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. ఆరు రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐ.ఏ.ఎస్‌లు బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై అధ్యయనం చేయడానికి జీహెచ్‌ఎంసీని సందర్శించారు. ముస్సోరిలో ట్రైనింగ్‌ పొందుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 16 మంది ఐఏఎస్‌లు రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం జీహెచ్‌ఎంసీకి వచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌, సీ అండ్‌ డీ వేస్ట్‌ ప్రాసెసింగ్‌, చెత్త సేకరణ, జీవీపీ, ఎలిమినేషన్‌, ఎస్‌.ఎన్‌.డీ.పీ, ఎస్‌.ఆర్‌.డీ.పీ, టౌన్‌ ప్లానింగ్‌, ఇంటి నిర్మాణ అనుమతులు, యూబీడీ ద్వారా చేపట్టిన గ్రీనరి, మోడల్‌ గ్రేవ్‌ యార్డ్‌, మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్స్‌, మోడల్‌ మార్కెట్లు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు, స్ట్రీట్‌ లైటింగ్‌, ట్రాఫిక్‌ సిగల్స్‌, లేక్స్‌ అభివద్ధి, పీఎం స్వానిధి, ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ సిస్టం, వేస్ట్‌ రీసైక్లింగ్‌, నగర పౌరులకు అందిస్తున్న సేవలు, హరితహారం, నిధుల సమీకరణ, శానిటేషన్‌లపై వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ మాట్లాడుతూ… హైదరాబాద్‌ నగర అభివద్ధికి పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పచ్చదనాన్ని పెంచడం, టౌన్‌ ప్లానింగ్‌, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా రూపొందించే దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో 6 జోన్లు, 30 సర్కిల్స్‌ ఉన్నాయని, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీకి ఆదాయ వనరులు బిల్డింగ్‌ పర్మిషన్‌లు, ఇంటి పన్ను, ప్రకటనలు, ట్రేడ్‌ లైసెన్స్‌ల ద్వారా సమకూరుతుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో శానిటేషన్‌ పనుల నిర్వహణ కోసం సుమారు 22 వేల మంది వివిధ కేటగిరి ఉద్యోగులు ఉన్నారని, వారికి ఉచిత హెల్త్‌ చెకప్‌తోపాటు, ఈ ఎస్‌ ఐ, ఈ.పీ.ఐ, బీమా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేపట్టిన నాలా అభివద్ధి పనుల చర్యలపై వివరించారు. జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసామని, వరదలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, ఈదురు గాలులకు చెట్లు విరిగినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు, ఇతర ప్రమాదాల సమయంలో ఎన్ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ సేవలు అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీలు రమేష్‌ ఆర్‌ దామోర్‌, దుని చంద్‌ రాణా, రోహిత్‌ జామ్‌ వాల్‌, దిశా ప్రణరు నాగ్‌ వంశీ, అనురాగ్‌ సక్సేనా, శుచి స్మిత సక్సేనా, అవినాష్‌ ప్రభాకర్‌ రావ్‌ పాతక్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పితాంబర్‌ దియోరే, ప్రకాష్‌ బాబురావు ఖాప్లీ, గోరక్ష మహాదేవ్‌ గదిల్‌ కార్‌, మకరంద్‌ ప్రహ్లాద్‌ దేశ్ముఖ్‌, మిలింద్‌ కుమార్‌ వామన్‌ రావు సాల్వే, సచిన్‌ కాలన్‌ ట్రే, ప్రియాంక గోస్వామి, పుఖ్‌ రాజ్‌ సేన్‌, ప్రకాష్‌ చంద్ర లు పాల్గొనగా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ.వీ.డీ.ఏం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, ఈ.ఎన్‌.సీ జియా ఉద్దీన్‌, అడిషనల్‌ కమిషనర్లు శివ కుమార్‌ నాయుడు, డాక్టర్‌ సునంద, వెటర్నరీ డిడి డాక్టర్‌ విల్సన్‌, ఎస్‌.డబ్లు.ఎం ఈఈ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.