ఆకతాయిలపై పోలీసుల కాల్పులు

– చున్నీ లాగి విద్యార్థిని మరణానికి కారణమైన నిందితులు
లక్నో : విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మరణానికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. దీంతో, నిందితుల కాళ్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారాహి గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి యువి హీరాపూర్‌ బజార్‌లోని ఒక కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. శుక్రవారం కాలేజీ ముగిసిన తర్వాత సైకిల్‌పై ఇంటికి వెళ్తోంది. కొందరు ఆకతాయిలు రెండు బైకులపై ఆమెను వెంబడించి వేధించారు. ఒక బైక్‌ వెనుక కూర్చొన యువకుడు యువతి చున్నీ లాగాడు. దీంతో ఆమె సైకిల్‌ అదుపుతప్పింది. వెనుక వస్తున్న మరో బైక్‌తోపాటు ఎదురుగా వచ్చిన బైక్‌ ఆమె సైకిల్‌ను ఢకొీట్టాయి. దీంతో, రోడ్డుపై పడిన ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మరణించిన విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారిని ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తుండగా పోలీసుల రైఫిల్‌ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరపడంతో షాబాజ్‌, అతని సోదరుడు అర్బాజ్‌, మరో నిందితుడు మహ్మద్‌ ఫైసల్‌ కాలికి గాయాలయ్యాయి. 20 ఏళ్ల వయసున్న ముగ్గురు నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని మృతికి సంబంధించిన వీడియో క్లిప్‌తోపాటు పోలీస్‌ కాల్పుల్లో గాయపడిన నిందితుల వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.