ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డికి పోలీసుల నోటీసులు

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైదరాబాద్‌ మసాబ్‌ ట్యాంక్‌ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం(నేడు) విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులపై ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి స్పందించారు. తాను గురువారం కరీంనగర్‌ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున జనవరి 17న విచారణకు హాజరవుతానని పోలీసులకు చెప్పారు.గతనెల 4న తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారంటూ కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్‌ పీఎస్‌కి వచ్చారు. అదే సమయంలో బయటకు వెళ్తున్న ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ వాహనాన్ని అడ్డుకుని తన అనుచరులతో కలిసి పీఎస్‌లో హల్‌చల్‌ చేశారు. తమ విధులను అడ్డుకున్నందుకు ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైన విషయం విదితమే. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్‌ ట్యాంక్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురాంను ఉన్నతాధి కారులు నియమించారు. అందులో భాగంగా పోలీసులు కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు.