వినాయక చవితి మండపాలకు పోలీస్ అనుమతులు తప్పనిసరి

– తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ -తాడ్వాయి 
వినాయక చవితిని పురస్కరించుకుని గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాలకు పోలీసులు అనుమతులు తప్పనిసరి అని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు విఘ్నేశ్వరుని విగ్రహం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లను నిమజ్జనం సమయంలో వినియోగించే వాహనం, వాటి డ్రైవర్ లైసెన్స్ తో కూడిన వివరాలను ముందుగా అందించాలని అన్నారు. మండపాలలో పార్టీలకు సంబంధించిన జెండాలు, డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీసులు సూచించిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే వినాయక విగ్రహా నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రారంభం నుండి నిమజ్జనం సమయం వరకు , ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.