విధానాలే ప్రధానంగా ఎన్నికల పోరాటం

విధానాలే ప్రధానంగా ఎన్నికల పోరాటంతీవ్రస్థాయిలో జరిగిన ఎన్నికల పోరాటం ముగింపు దశకు చేరుకుంది.వచ్చే ఆదివారంలోగానే ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేస్తాయి. స్థూలంగా రాజకీయ చిత్రం గోచరమవు తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల పోరాటం వివిధ పక్షాలకు పెద్ద సవాలుగానే మారింది. లౌకికతత్వం,కేంద్ర పెత్తనం, మోడీ నిరంకుశ పోకడలు పెద్దచర్చకే దారితీశాయి. తెలుగు రాష్ట్రాలలో ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత నేత జగన్‌ మలి విజయమా లేక చంద్రబాబునాయుడు ఎన్డీయే పునరాగమనమా అన్నది దేశవ్యాపిత ఆసక్తి నెలకొంది. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వం లోక్‌సభ స్థానాలలో ఆధిక్యత సాధించి స్థిరపడుతుందా, బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ఎలా వుంటుంది, బీజేపీ పెరుగుతుందా? అన్న అంశం కూడా ఉత్కంఠ కలిగించింది.జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమి,ప్రాంతీయ పార్టీలూ వామపక్షాలూ హోరాహోరీగా తలపడిన ఈ పోరాటంలో ప్రజల తీర్పు ఎలా వుంటుందనేది జూన్‌ నాలుగుతో తేలిపోతుంది. దీనిపై పలురకాల విశ్లేషణలు సర్వేలు, అంచనాలు, వాదోప వాదాలు, తిట్లూ శాసనార్థాలూ సాగిపోతున్నాయి. బహుశా ఫలితాల తర్వాతా ఈ వాతావరణం కొంతకాలం కొనసాగు తుంటుంది. ఈ నేపథ్యంలో మౌలికంగా మీడియా సంస్థల, సంఘాల, నేతల పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు మనం తేరిపారచూసే అవకాశమేర్పడింది. ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈ పోరాటంలో ఈ ఎన్నికల పోరాటం నేర్పిన పాఠమేంటి అన్నది చెప్పుకునే సందర్భం ఇది.
వ్యవస్థలు, విధానాల చర్చ
ఈ ఎన్నికల పోరాటం వివాదాల నుంచి విధానాల వైపు, వ్యక్తుల నుంచి వ్యవస్థల వైపు మరలించడం సైద్ధాంతిక శక్తుల తొలి విజయం. ఓసారి వెనక్కు తిరిగి చూస్తే విశ్వగురు మోడీ విజయయాత్రలా మార్చి అబ్‌కా పార్‌ చారౌసౌ పార్‌(ఈ సారి నాలుగు వందల సీట్లు)అంటూ హంగామాగా మొదలైంది.ఇప్పుడెవరూ ఆ మాట అనడం లేదు. అసలు ఆ మాటే మాది కాదు ప్రజల నుంచి తీసుకున్నామని మోడీనే చెప్పుకోవలసిన స్థితి. బీజేపీకి బాగా ఆనుకూలంగా మాట్లాడే సంస్థలూ వ్యక్తులూ కూడా ఏదో విధంగా మెజార్టీ వస్తుందని సరిపెడుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌,సి ఓటర్‌ యోగేంద్ర దేశ్‌ముఖ్‌, యోగీంద్ర యాదవ్‌ ఇలా రకరకాల వ్యక్తులను తీసుకుంటే 300కు దగ్గరగా సరిపెడుతున్నారు. తాజాగా అంచనాలు విడుదల చేసిన యోగేంద్రయాదవ్‌ కూడా బీజేపీకి మెజార్టీ రాదంటూనే మిత్రపక్షాలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. అమెరికా నుంచి కూడా కొందరు మేధావులు తరలివచ్చి మోడీ విజయం అంటూ అంచనాలు ప్రకటించి వెళ్లారు. ఆరెస్సెస్‌తో బంధమే దెబ్బతీస్తుందన్న భయంతో బీజేపీితో దానిపై ఆధారపడి లేదని నడ్డాతో అనిపించి మరో నాటకం నడిపించారు. మరో వంక బీజేపీయేతర ప్రభుత్వమే వస్తుందని ఇండియా నాయకులం టున్నారు. కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌, చిదంబరం వంటివారు ఆ మేరకు వివరంగా ప్రకటనలు చేశారు.
బీజేపీకి పోటీ కాంగ్రెస్‌ మాత్రమేనన్న వాదనలూ తగ్గి 100-125 దాటవని చెబుతున్నారు. మరో వంక మమతాబెనర్జీ వంటి అవకాశవాదులు తాము ఇండియాను బయటనుంచే బలపరుస్తామంటూ తదుపరి ఎత్తులకు అవకాశం అట్టిపెట్టుకుంటున్నారు.చంద్రబాబు నేరుగా పొత్తు పెట్టుకోగా జగన్‌ వంటివారు తమపై ఆధారపడి మోడీ రావాలని కలలు కంటున్నారు. ఏతావాతా వీరంతా కూడా బీజేపీ ప్రత్యక్ష పరోక్ష దోస్తులే గనక ఎలాగో సర్కారులోకి వస్తామని మోడీ, అమిత్‌ షా వంటివారు ఆశలు పెట్టుకున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ బాగా పుంజుకోవడం, బీహార్‌లో తేజస్వియాదవ్‌ నాయకత్వంలో ఇండియాకు మెరుగైన అవకాశాలు, కర్నాటకలో తెలంగాణ లో కాంగ్రెస్‌ అధికారంలో వుండటం సానుకూల అంశాలుగా భావిస్తున్నా రెండు ప్రధాన పార్టీలూ పోటీ పడే హిందీ రాష్ట్రాలలో ఏం జరుగుతుందనేది తేలని అంశమే. మహారాష్ట్రలో వివిధ ప్రాంతీయ పార్టీలలో చీలిక వర్గాలు సృష్టించి బీజేపీ కొంచెం అనుకూలత తెచ్చుకున్నట్టు కనిపిసున్నది.తమిళనాడు, కేరళ కూడా స్పష్టంగా ఎన్డీయేకు అవకాశమే లేని రాష్ట్రాలుగా వున్నాయి. ఈ విధంగా చూస్తే మోడీ మోతకు చిల్లు పడిందనేది స్పష్టమే.అంతేగాక ఆయన విశ్వగురు ముసుగు తీసేసి నేరుగా విద్వేష వాక్కులలోకి దిగవలసి వచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చివరకు ఎంతోకొంత ఎన్నికల సంఘమే స్పందించవలసి వచ్చింది.అయితే ఎన్నికల సంఘం పాత్రపై ఇప్పటికీ నీలినీడలు అలుముకునే వున్నాయి.17సి ఫారం ప్రకారం పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్లు వేసిన వారి సంఖ్యను బహిర్గతం చేయడానికి ఎన్నికల సంఘం నిరాకరి స్తున్నది. బీజేపీ, ఆరెస్సెస్‌ నేతల మతతత్వ ప్రచారాన్ని ఇతర పార్టీల నేతల ప్రతి విమర్శనూ ఒకేగాట కడుతున్నది. ఏపీలో మాచర్ల ఘటనలతో సహా అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘ వ్యవ హార శైలి విమర్శల పాలైంది. తెలంగాణ క్యాబినెట్‌ సమావేశానికి కూడా అనుమతిం చకుండా వివక్షకు పాల్పడింది. రేపటి ఫలితాల తర్వాత ఈ అంశాలన్నీ కూడా ముందుకు రానున్నాయి.
ఏపీ, తెలంగాణల దృశ్యం
ఆంధ్రప్రదేశ్‌లోనైతే కేవలం టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధంగా ఇంకా చెప్పాలంటే జగన్‌, చంద్రబాబు పోరాటంగా మొదలైంది, చంద్రబాబు అరెస్టు కేసుల తర్వాత ఇది పరాకాష్టకు చేరింది. ఈ మద్యలో బీజేపీ ఎన్డీయేలో భాగమైన జనసేన పవన్‌ కళ్యాణ్‌ అసలు కేంద్రం వూసేలేకుండా కేవలం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకపోవడం అంటూ కొత్తపాట తెచ్చారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా విడిగా లౌకిక పార్టీలూ ఆయనతో కలవచ్చనే పల్లవీ కొన్ని వైపుల నుంచి వినిపించింది. జగన్‌తో ఆస్తి వివాదాల కారణంగా దూరమైన షర్మిల తెలంగాణ నుంచి ఏపీ కాంగ్రెస్‌లో ప్రవేశించిన తర్వాత ఇది మరీ కుటుంబ సమస్యగానూ మారింది. ఈ పరిస్థితుల్లోనే సీపీఐ(ఎం) ఇతర లౌకిక ప్రజాస్వామిక వాద శక్తులతో కలసి బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ కూటమి, నిరంతరం బలపర్చే వైసీపీ రెంటినీ ఓడించాలనే విధానంతో ఇండియా ఆవిర్భావానికి కృషి చేసింది. ఈ క్రమంలోనే వామపక్షాలూ కాంగ్రెస్‌ కలసి పోరాడాయి. రాజధానికి సహాయం ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పోలవరం, విభజన హామీలు లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలు తెరమీదకు వచ్చాయి. ఆఖరుకు షర్మిల కూడా చంద్రబాబు, జగన్‌ బీజేపీకి లోబడిపోయారనే అంశం నొక్కి చెప్పారు. పోలింగ్‌ చివరి దశలో మల్లికార్జున ఖర్గే, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటివారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల పోరాట స్వరూపం మారింది.ముస్లిం రిజర్వేషన్లపై మోడీ బీజేపీ వైఖరిని చంద్రబాబు జగన్‌ ఉభయులూ తోసిపుచ్చవలసి వచ్చింది. విశాఖ ఉక్కుపై ఎన్నికల ఫోకస్‌ మారిందని ‘హిందూ’ వంటి పత్రిక రాసింది. ఇదంతా మొదట బయిలుదేరిన నాటి తీరుకు భిన్నమైన సన్నివేశమే.
తెలంగాణలోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకే పరిమితమైన రాజకీయ రణం కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం) కలసికట్టుగా కదలడంతో కొత్తరూపు తీసుకున్నది. ఇండియా వేదిక బీజేపీ, బీఆర్‌ఎస్‌ త్రిముఖ సమరంగా మారింది. ఇదే ఇప్పుడు శాసనమండలి ఉప ఎన్నికలలోనూ కొనసాగు తున్నది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్గాలు సీపీఐ(ఎం)కు ఆత్మగౌరవం లేదని తిట్టిపోస్తే గట్టి సమాధానం ఇవ్వవలసి వచ్చింది. గతంలో ఎవరు ఏం మాట్లాడారనే మీమాంస కన్నా లౌకిక శక్తులు దేశవ్యాపితంగా చేస్తున్న పోరాటంలో తెలంగాణ భాగం కావడం, బీజేపీని ఓడించడం కీలకమనే వాస్తవికత సీపీఐ(ఎం) ప్రదర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ది బీజీపీపై మెతకవైఖరి అంటూ వచ్చిన అభిప్రా యాలను స్వయంగా తోసిపుచ్చవలసి వచ్చింది. విచిత్రమే మంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ పున:సమీకరణ జరుగుతుందని రేవంత్‌ బీజేపీలోకి వెళతారని, బీఆర్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. మరోవైపున బీఆర్‌ఎస్‌లోంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళతారని కిషన్‌రెడ్డి అంటున్నారు.రాజకీయ దుమారం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపైనా తెలంగాణలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయనే దానిపైనా ఇప్పటికీ రెండు రకాల అంచనాలు హోరాహోరీగా సాగుతూనే వున్నాయి. ఆ జోస్యాలతో నిమిత్తం లేకుండా ఒక రాజకీయ వాతావరణం తేవడమే వామపక్షాలు సాధించిన సత్పలితం.ఇందుకు ఇతర లౌకిక ప్రజానుకూల శక్తుల సహకారం లభించింది.
మీడియా ద్వంద్వత్వం
తెలుగు మీడియాలో మొదటి నుంచి పాలకవర్గాల ప్రాబల్యం ఏదో ఒక వర్గాన్ని భుజాన మోయడం పరిపాటి. వర్తమాన ఘట్టంలో మరీ బాహాటంగా రెండుగా చీలిన మీడియా వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మొగ్గును చూపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియాపై ఆగ్రహానుగ్రహాలు బాహాటంగానే ప్రదర్శించారు. ప్రాంతీయ అధికారం తప్ప జాతీయ రాజకీయాల స్పృహ కూడా వదలిపెట్టి వారినో వీరినో గెలిపించడమే లక్ష్యంగా పాక్షిక చిత్రం ఇచ్చింది. వచ్చిన చూపిన అంశాల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది, రాజ్యాంగ అంశాలను కూడా స్థానిక రాజకీయ కోణంతోనే చిత్రిస్తూ ప్రజల దృష్టిని దారిమళ్లిం చింది. ఉద్యమాలనూ, బహిరంగ విషయాలను కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఇటో అటో ఇస్తూ వచ్చింది. కులమత ధోరణులు, అసభ్య దూషణలు అమానుష దాడులూ నిత్యకృత్యంగా మారాయి. అక్రమధనం వికటాట్లహాసం చేసింది.
సైద్ధాంతిక నిబద్దత లేకుండా బీజేపీని మోసిన జనసేన అధినేత సినిమా అభిమానాల నేపథ్యం కూడా చర్చను పక్కదోవ పట్టించడానికి కారణ మైంది. విస్తారంగా పెరిగిన సోషల్‌ మీడియా సోపానంగా అప్రధాన వివాదాలే సమయాన్ని బుర్రలనూ ఆక్రమించి వాతావరణాన్ని కలుషితం చేశాయి, ఇంతటి పరిస్థితిలోనూ ఎంతోకొంత చర్చ పట్టాలపై వుందంటే దానికి కారణం ‘ప్రజాశక్తి’, ‘నవతెలంగాణ’ వంటి నిబద్ద పత్రికలు, ప్రజాపక్ష ఉద్యమాలు, శక్తులూ నిర్వహించిన విస్పష్టమైన పాత్ర మాత్రమే.ఎన్నికల పోరాటంలోనూ పోలింగ్‌ అనంతరం కూడా ఉద్రిక్తతలు పెంచడానికి రకరకాల పాచికలు వేసినా ప్రజలు ప్రశాంతత కాపాడు కున్నారు. రేపు తుదితీర్పు వెలువడేవరకూ ఇదే చైతన్యంతో అప్రమత్తతతో వుండాలని కోరుకుందాం. పాలకవర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం పదవులకోసం రగిలించిన వివాదాలు, సృష్టించిన వైరాలూ, వివాద విద్వేషాలు పక్కకునెట్టి ప్రజల ఐక్యత కాపాడు కోవాలి. పదేండ్లు పూర్తి చేసుకుంటున్న విభజిత రాష్ట్రాల సమస్యల పరిష్కరించు కుంటూ మత రాజకీయాలను ఆమడదూరం కొట్టడానికి మరింత జాగ్రత్తగా వ్యవహరిం చాల్సిన అవసరముంది. అందుకు విరుద్ధమైన సంకుచిత పోకడలూ, అల్పిష్టి తగాదాలను దూరం కొడదాం. ప్రజాశక్తుల ఐక్యతే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షణ.
                                                                                                                       – తెలకపల్లి రవి