ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పోస్టింగులు

Postings for IAS and IPS– సీఈసీ ఖరారు…ఉత్తర్వులు ఇచ్చిన సీఎస్‌
– హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తప్పించిన 20 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి సీఈసీ తప్పించిన అధికారుల స్థానంలో ఒక్కో పోస్టులో ముగ్గురేసి అధికారుల పేర్లను సిఫార్సు చేస్తూ జాబితా పంపించిన విషయం తెలిసిందే. ఈ జాబితాను పరిశీలించిన సీఈసీ ఆయా పోస్టులకు అధికారుల పేర్లను ఖరారు చేసి, సీఎస్‌కు జాబితా పంపింది. దీనితో శుక్రవారం ఆయా అధికారులకు నూతన పోస్టింగులు ఇస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం లోగా అధికారులంతా బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో కోరారు. పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సందీప్‌ శాండిల్యను హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌గా నియమించారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఏ వాణి ప్రసాద్‌ను రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నియమించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ అండ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న భారతి హౌలికేరిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సొసైటీ ఆఫ్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) సీఈఓగా పనిచేస్తున్న గౌతం పొట్రును మేడ్చల్‌ కలెక్టర్‌గా నియమించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తున్న జెందగీ హన్మంత్‌ కొందిబను యాదాద్రి కలెక్టర్‌గా నియమించారు. సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆశిష్‌ సంగ్వాన్‌ను నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంథనశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సునీల్‌శర్మను ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ అండ్‌ హ్యాడీక్రాఫ్ట్స్‌, పరిశ్రమల శాఖల కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ను ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్‌ క్రిస్టియానా జెడ్‌ ఛోంగ్తును వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించారు.
ఐపీఎస్‌లు వీరే…
రెగ్యులర్‌ రిక్రూటర్స్‌ (ఆర్‌ఆర్‌) నియమితులైన ఐపీఎస్‌ అధికారుల్ని పలు జిల్లాల ఎస్పీలుగా నియమించారు. రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (అడ్మిన్‌)గా పనిచేస్తున్న అంబర్‌ కిశోర్‌ ఝాను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. సైబరాబాద్‌ డిసీపీ (క్రైం)గా పనిచేస్తున్న కల్మేష్మర్‌ షింగిన్వార్‌ను నిజామాబాద్‌ ఎస్పీగా నియమించారు. హైదరాబాద్‌ సిటీ సౌత్‌, ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న చెన్నూరి రూపేష్‌ను సంగారెడ్డి ఎస్పీగా, తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ నాల్గవ బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ సింధూశర్మను కామారెడ్డి ఎస్పీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఇన్స్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (లా అండ్‌ ఆర్డర్‌)లో పనిచేస్తున్న సన్ప్రీత్‌ సింగ్‌ను జగిత్యాల ఎస్పీగా నియమితులయ్యారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌-1 విభాగంలో డీసీపీగా పనిచేస్తున్న గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ను నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీగా పనిచేస్తున్న రితిరాజ్‌ను జోగులాంబ గద్వాల ఎస్పీగా నియమించారు. టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్‌ పాటిల్‌ సంగ్రామ్‌ సింగ్‌ గణపతిరావును మహబూబాబాద్‌ ఎస్పీగా నియమించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో అడ్మిన్‌ విభాగం డీసీపీగా పనిచేస్తున్న యోగేష్‌ గౌతంను నారాయణపేట్‌ ఎస్పీగా, హైదరాబాద్‌ సిటీ సౌత్‌ జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న ఖారే కిరన్‌ ప్రభాకర్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌-1 డీసీపీగా పనిచేస్తున్న బీకే రాహుల్‌ హెగ్డేను సూర్యాపేట ఎస్పీగా నియమించారు.
జగిత్యాల ఎస్పీగా సంప్రీత్‌ సింగ్‌ ,నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కల్మేశ్వర్‌ , సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేష్‌ , కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ , మహబూబ్‌నగర్‌ ఎస్పీగా హర్సవర్ధన్‌ , నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా వైభవ్‌ రఘునాథ్‌ , జోగులాంబ గద్వాల్‌ ఎస్పీగా రితిరాజ్‌ , మహబూబాబాద్‌ ఎస్పీగా పాటిల్‌ పంగ్రామ్‌సింగ్‌ గణపతిరావ్‌ , నారాయణపేట్‌ ఎస్పీగా యోగేష్‌ గౌతమ్‌ , భూపాలపల్లి ఎస్పీగా కిరణ్‌ ప్రభాకర్‌ , సూర్యాపేట ఎస్పీగా రాహుల్‌ హెగ్డే