ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌…

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌...– టి20 ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధం
– 1న బంగ్లాదేశ్‌తో ఏకైక ప్రాక్టీస్‌ మ్యాచ్‌
న్యూయార్క్‌: ఐసిసి టి20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమౌతున్నారు. జట్టు సభ్యులంతా న్యూయార్క్‌కు చేరుకోవడంతో బుధవారం ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగమయ్యారు. టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఏకైక వార్మప్‌ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో జూన్‌ 1న తలపడనుంది. ఈ మ్యాచ్‌ న్యూయార్క్‌ వేదికగా జరగనుంది. ప్రాక్టీస్‌ సందర్భంగా జట్టు బలాబలాలు, బలహీనతలు, అవకాశాల గురించి కెప్టెన్‌, కోచ్‌ ప్రధానంగా దృష్టి సారించారు. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌లో మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చాలాకాలంలో టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న ఐసిసి ట్రోఫీని ఈసారి తప్పక సాధించాలన్న దృఢ సంకల్పంతో ఆటగాళ్లంతా కసరత్తు చేస్తున్నారు. ఐసిసి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్లోకి రెండుసార్లు ప్రవేశించిన టీమిండియా రెండుసార్లు ఫైనల్లోకి చతికిలపడి రన్నరప్‌కే పరిమితమైంది. అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఆసీస్‌ చేతిలో ఓడింది. ఇక 2022 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకోవడంలో టీమిండియా విఫలమైంది. ఈ క్రమంలో 9వ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా, వెస్టిండీస్‌ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామాలు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టి20లో టీమిండియా 212 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. చివరకు సూపర్‌ ఓవర్లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో టి20 ఫార్మాట్‌లో భారీస్కోర్లు నమోదైనా ఫలితం ఏ నిమిషంలోనైనా తరుమారయ్యే అవకాశముంది.
ఆటగాళ్లు లేక మైదానంలోకి కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ కూడా..
మరో మూడురోజుల్లో టి20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంకా న్యూయార్క్‌కు చేరుకోలేదు. దీనికి ప్రధాన కారణం కొందరు ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఆడటం కాగా.. మరికొందరు గాయాలబారిన పడడం. బుధవారం నమీబియాతో జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌కు ఆస్ట్రేలియాకు కనీసం 11మంది కూడా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో నమీబియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ జార్జ్‌ బెయిలీ, ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌ డొనాల్డ్‌ మైదానంలోకి దిగారు. వారితోపాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఫీల్డింగ్‌ చేశారు. జూన్‌ 5లోగానే కమిన్స్‌తోపాటు ఇతర క్రికెటర్లు విండీస్‌కు చేరుకుంటారు. ఆ రోజే ఆస్ట్రేలియా జట్టు ఒమన్‌తో గ్రూప్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఐపిఎల్‌లో పెద్దగా ఆకట్టుకోని డేవిడ్‌ వార్నర్‌ తన మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల తేడాతో నమీబియాను చిత్తుచేసింది. పోర్ట్‌స్పెయిన్‌ వేదికగా జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 119పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 10ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. వార్నర్‌(54నాటౌట్‌)అర్ధసెంచరీకి తోడు టిమ్‌ డేవిడ్‌(23), వేడ్‌(12నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. నమీబియా బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ గ్రీన్‌(36) బ్యాటింగ్‌లో రాణించగా.. ఆసీస్‌ బౌలర్లు జంపాకు మూడు, హేజిల్‌ వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. బియాను 119/9 స్కోరుకే కట్టడి చేసిన ఆసీస్‌.. లక్ష్య ఛేదనలో కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 21 బంతుల్లో 54 పరుగులు చేశాడు. టిమ్‌ డేవిడ్‌ (23), మ్యాథ్యూ వేడ్‌ (12లి) దంచేశారు. ఈ మ్యాచ్‌ ఫీల్డింగ్‌ సమయంలో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ గాయం కారణంగా మధ్యలోనే డగౌట్‌కు వెళ్లాడు. అయితే, తన ఇంజూరీ పెద్ద సమస్య కాదని ఆ తర్వాత మార్ష్‌ వెల్లడించాడు.