సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకుడు. పిఎల్వి క్రియేషన్స్పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా ఈనెల 13న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం చిత్ర బృందం ఆర్థిక విరాళాన్ని అందించింది. దర్శక, నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ, ‘నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నా. అప్పులు తెచ్చి మరీ సినిమా తీశాను. నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. ఆయన ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ప్రసాద్ మంచి విజువల్స్ ఇచ్చారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని చిత్రాన్ని అయితే తీశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. పి.ఆర్.ఓ. సాయి సతీష్ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చి మా సినిమాకు థియేటర్లు ఇస్తామని అన్నారు’ అని తెలిపారు. ‘ఈ టైటిల్ నాకు చాలా నచ్చింది. చాలా పాజిటివ్గా అనిపించింది. సినిమాల్లో పెద్దది, చిన్నది అని ఉండదు. ‘పెళ్లి చూపులు’ చిన్న బడ్జెట్లో చేశా. కానీ దాన్ని పెద్ద హిట్ చేశారు. అందుకే మంచి సినిమా, చెడ్డ సినిమా అని ఉంటుంది. ఇది మంచి చిత్రం అవుతుంది. విఘ్నేశ్ చాలా మంచి వ్యక్తి. మార్కండేయ సంగీతం బాగుంది’ అని నిర్మాత రాజ్ కందుకూరి చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ మాట్లాడుతూ, ‘ప్రణయ గోదారి ఎంతో విశాలంగా ఉంటుంది. విఘ్నేశ్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అని అనుకుంటున్నాను’ అని అన్నారు.