విద్యార్థి ప్రశాంత్‌ది ప్రభుత్వ హత్యే

– డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భువనగిరి ఎస్సీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌తో చనిపోయిన విద్యార్థి ప్రశాంత్‌ది ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సిహెచ్‌. ప్రశాంత్‌ ఫుడ్‌ పాయిజన్‌కు గురై చికిత్స పొందుతూ మరణించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడంతో ప్రశాంత్‌ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో గతంలో విద్యార్థులు చనిపోతే హాస్టల్‌ కి సంబంధించిన అధికారులకు,పోలీసు శాఖకు తెలంగాణ ఎస్సీ కమిషన్‌ నోటీసులు పంపించిందని గుర్తుచేశారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రశాంత్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు.