అవినీతికి అవిభక్త కవలలు ప్రధాని, అదానీ…

– రైతుల సంపద డబుల్‌ చేస్తామని చెప్పి.. కష్టాలు డబుల్‌ చేశారు
– తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని ప్రయివేటీకరిస్తే ఊరుకునేది లేదు
– రెండు నెలల్లో ఇండిస్టీయల్‌, ఐటి పార్కులకు శంకుస్థాపన : ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌
– హోం మంత్రితో కలిసి రామగుండం పోలీసు కమిషనరేట్‌ ప్రారంభం
నవతెలంగాణ-గోదావరిఖని
అవినీతికి అవిభక్త కవలలు ప్రధాని, అదానీ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. ప్రధాని మోడీ బడా పారిశ్రామిక వేత్త అదానీకి దేశ సంపదను దోచి పెడుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సోమవారం పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. గోదావరిఖని జవహార్‌లాల్‌ నెహ్రు స్టేడియంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ సభలో ప్రసంగించారు. దేశ సంపదను మోడీ అదానీకి కట్టబెట్టాడన్నారు. రైతుల సంపద డబుల్‌ చేస్తామన్న మోడీ, వారి కష్టాలు డబుల్‌ చేశాడని ఆరోపించారు. సింగరేణి ప్రయివేటీకరణ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో సింగరేణిలో పెను మార్పులు వచ్చాయనీ, కోల్‌ ఇండియాకే ఆదర్శంగా సింగరేణి నిలిచిందన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు సరిహద్దులో ఉండే సైనికులకు తేడాలేదనీ, తమ జీవితాలను పణంగా పెట్టి మనకు వెలుగులు ఇస్తున్నారని కొనియడారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో 19,260 కొలువులు భర్తీ చేశామని చెప్పారు. పదవీ విరమణ వయస్సు పెంచుకున్నామని, 18 శాతం ఉన్న బోనస్‌ను 27శాతంకు పెంచుకున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని సీఎం సంకల్పంచి కల నిజం చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ లేకుంటే టీ కాంగ్రెస్‌, టీ బీజేపీ పదవులు ఉండేవా అన్నారు. కాంగ్రెస్‌కు 55 ఏండ్లు అధికారం ఇస్తే రైతులకు నీళ్లు, కరెంట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. రెండు నెలల్లో రామగుండం ఇండిస్టియల్‌ పార్క్‌ శంకుస్థాపన తామే చేస్తామన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే ఎకరానికి రూ.పది వేలు పరిహారం ఇప్పించాలన్నారు.
పోలీస్‌ కమిషరేట్‌ ప్రారంభోత్సవంలో కేటీఆర్‌
అధునాతన హంగులతో జీ ప్లస్‌ -2 పద్ధతిలో నిర్మించిన గోదావరిఖనిలోని పోలీస్‌ కమిషనరేట్‌ భవనాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ, అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో బెంగాల్‌ ఆచరించిన కార్యక్రమాలను.. దేశం అనుస రించేదని అనేవారని, ఇప్పుడు తెలంగాణ ఆచరించిన కార్యక్రమాలను, దేశం అనుసరిస్తుందని అన్నారు. ప్రజలంతా శాంతియుతమైన జీవితం గడిపేందుకు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడితో సమానంగా అంతర్గత భద్రత కోసం మన పోలీ సులు పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ పకడ్బందీగా శాంతిభద్రతలను నిర్వ హిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీసులకు ఆధునిక భవనాలు, మంచి వాహనాలు సాంకేతికతను వినియోగించుకునే విధంగా అవసర మైన అన్ని పరికరాలను అందించామని అన్నారు. పోలీసు సంక్షేమ చర్యలు భాగంగా దేశానికి ఆదర్శ వంతంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రాధాన్యత శాంతిభద్రతల నిర్వహణ కోసం సీఎం కేసీఆర్‌ కల్పించారని, గతంలో కేవలం రెండు పోలీస్‌ కమిష నరేట్లు ఉండేవని, ప్రస్తుతం అదనంగా ఏడు పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేసు కున్నామన్నారు. డీజీపీ అంజనికుమార్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి తమ సందేశాలు ఇచ్చారు. అనం తరం పోలీస్‌ ప్రతినిధులు మంత్రుల బృందానికి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ, ప్రభుత్వ శాసన సభ మండలి చీఫ్‌ విప్‌ భాను ప్రసాద్‌ రావు, శాసన సభ్యులు దాసరి మనోహర్‌ రెడ్డి, దివాకర్‌ రావు, మాజీ మంత్రి ఎల్‌.రమణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.