నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనలు మరో ఎన్నికల జుమ్లా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టంలాగే ఈ ప్రకటనలు కూడా ఎప్పటికీ నెరవేరుతాయో ఎవరికీ తెలియదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు రావడంతో ఓట్ల కోసమే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామనీ, అలాగే గతంలో సాధ్యం కాదని చెప్పిన పసుపు బోర్డు కూడా పెడతామని ప్రధాని బూటకపు ప్రకటనలు చేశారని విమర్శించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను దాదాపు పదేండ్లు అవుతున్న అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మబోరని తెలిపారు. ఎన్ని మాయ మాటలు చెప్పినా బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయబోరని ఆయన స్పష్టం చేశారు.