ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి: ప్రియాంక గాంధీ

నవతెలంగాణ -ములుగు:  ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వివరించారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశించారు. కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది.  రాజకీయ లబ్ధికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారు. ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రిమోట్‌ ప్రధాని మోడీ చేతిలో ఉంది.  బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి. ల్యాండ్‌ మాఫియా, శాండ్‌ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోంది. రంగారెడ్డి జిల్లాలోని రూ.వేలకోట్ల విలువన భూములు భారాస పెద్దలు దోచుకున్నారు. భూదాన్‌ భూములను ఆన్‌లైన్‌లో తొలగించి ఆక్రమించుకున్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు.18 మంత్రిత్వశాఖలు కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. భారాస నేతలు రూ.వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారు. భారాస ప్రభుత్వంలో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం న్యాయం జరగటం లేదు. ఎవరి జనాభా ఎంత ఉందో తెలియకుండా ఎలా న్యాయం చేస్తారు?’’ అని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.