ప్రస్తుత 18వ లోక్సభలో పార్టీల బలాబలాలు మారాయి. గత సభలో తన పార్టీకి ఉన్న మందబలం వల్ల మోడీ ఏమి చేసినా చెల్లింది. ఎన్డీయే అన్న ఫ్రంటు ఒకటి గత సభలో ఉన్నా అది పేరుకు మాత్రమే. ఎన్డీయేలోని మిగతా పార్టీలు బీజేపీకి తందాన దాసులే. కనుక తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగా బీజేపీ గత పదేళ్లలో మానవ హక్కులపై తీవ్రమైన దాడి చేసింది. మానవ హక్కుల కోసం, ప్రజాస్వామిక విధానాల కోసం నిలిచిన వారిపై దాడుల పరంపరను కొనసాగించింది. రాజద్రోహం చట్టాన్ని విచ్ఛలవిడిగా ఉపయోగించింది. ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయాల్సిన సంస్థలను మోడీ ప్రభుత్వం వేటకుక్కల్ని చేసి తమ రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల, క్రైస్తవుల ఆస్తులను పరివార్ మూకలే కాదు, ప్రభుత్వ విభాగాలు కూడా ధ్వంసం చేశాయి, తగలబెట్టాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు అంకెలతో సహా భారతదేశంలోని మానవ హక్కుల దుస్థితిని వెల్లడించాయి.
కాగా లోక్సభలో ఇప్పుడు బలాబలాలు మారిన దష్ట్యా ”56 అంగుళాల” రొమ్ము విరుచుకొని తిరిగే మోడీ గతంలో వాజ్పేయి తరహాలోనే ముసుగు ధరించారు. బీజేపీ గత పదేండ్లలో మోడీ అమలు చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలు కాంగ్రెస్ కాలంలో ఆమోదించినవే. వాటికి మోడీ మరింత పదును పెట్టి వాడారు. కాంగ్రెస్ అనుసరించిన ఆ విధానాల పట్ల వ్యక్తమైన వ్యతిరేకత మూలంగానే బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారానికి ఎగబాకాయి. ఈ దశలో కాంగ్రెస్ ఆ విధానాలను అడుగడుగునా వ్యతిరేకించి మోడీ ప్రభుత్వాన్ని నిలేస్తుందా? ఉపేక్షిస్తుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న. దేశవ్యాప్త పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ దక్కోణంలో ప్రజానుకూల మార్పు వచ్చిందని ఆశించిన వారికి ఆయన ఆశాభంగం కల్పిస్తారా? పర్వాలేదనిపిస్తారా? అన్నది కూడా త్వరలోనే వెల్లడవుతుంది.
ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించడంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ప్రజాసంఘాలతో పాటు మీడియా కూడా ప్రధాన పాత్ర వహించాలి. కాని మోడీ హయాంలో అది గోది మీడియా (మోడీ బడిలో చేరిన మీడియా)గా మారింది. ఆ బంధనాల నుండి మీడియా సంస్థలు ఇప్పుడైనా బయటపడి స్వేచ్ఛగా వ్యవహరిస్తాయా? అన్నది కూడా ఇంకా ప్రశ్నార్థకమే.
మోడీ మూడోసారి ప్రధాని కావడాన్ని హిందూ పత్రిక ‘మూడో అవతారం’ అంటూ తన సంపాదకీయంలో సరిగ్గానే వ్యాఖ్యానించింది. మోడీ దుస్తులు మార్చినట్లుగా మాటలు మార్చుతారు. ఇప్పటికే అవతారం మార్చారు. భారత రాజ్యాంగం పనికి రాదని, అది అతుకుల బొంత అని మొన్నటి దాకా అన్నారు. ఎన్నికల ఫలితాల్లో తల బొప్పికట్టేసరికి రాజ్యాంగాన్ని కండ్లకద్దుకున్నాడు. ఆయన అవకాశవాద మిత్రుల్లో ఒకరైన చంద్రబాబు గతంలో ఒకసారి తానే కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పాననే భ్రమల్లో ఉండిన ఈసారి కూడా కూడా తాను చక్రం తిప్పబోతున్నట్లు జనాన్ని నమ్మించేపనిలో ఉన్నారు. నితీష్ కుమార్, పాశ్వాన్లు అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాలని ఓ మాటైనా అన్నారు. కాని మోడీ వాచ్మెన్ (దేశానికి కాపరి) కాదు వట్టి అబద్ధాలకోరు అని ఆక్రోషించిన వ్యక్తే ఇప్పుడు నమో మోడీ అంటున్నారు.
మోదీ సర్కార్ ఈసారి ‘నీట్’ స్కామ్తో పాలన మొదలెట్టింది. పోయినసారి పీఎం కేర్స్, ఎన్నికల బాండ్లు , గుత్త పెట్టుబడిదార్లకు కోటాను కోట్ల రూపాయల అప్పులు రద్దు వంటి అవినీతి స్కామ్లతో పాటు మానవ హక్కుల పట్ల కూడా మోదీ దుర్మార్గంగా వ్యవహరించారు. ఆ దుర్మార్గాల్లో ఒకటి బీమా కోరేగావ్ కేసు. అర్థం పర్ధం లేని ఆరోపణలతో ఆ కేసు బనాయించారు. కేసులో అరెస్టయిన స్టాన్ స్వామి లాంటి వృద్ధ సంఘసేవకుడు జైల్లో అమానుష పరిస్థితుల్లో చనిపోయినా మోడీ ప్రభుత్వానికి దున్నపోతుపై ఈగ వాలినట్లు కూడా కాలేదు. ఆ కేసులోని మరో ముద్దాయి విరసం నేత వరవరరావు కండిషనల్ బెయిల్ మీదే ఇంకా ముంబాయి లోనే ఉన్నారు. ఆ కేసులోని నిందితులంతా కలిసి మోడీ హత్యకు కుట్ర పన్నారన్నది అభియోగం. ఆ కేసు విచారణ ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని స్థితి. అప్పటిదాకా నిందితులు జైల్లోనో, బెయిల్ పైనో గడపాల్సిందే. వెనుకటికి టాడా చట్టాన్ని వ్యతిరేకించిన బీజేపీ తన హయాంలో ఉపా చట్టం కింద బెయిల్కు కూడా అవకాశం లేకుండా సవరణ చేసింది. అనేక మంది పాత్రికేయులను అది రాచిరంపాన పెట్టిం ది. వారి ఇండ్లపై దాడి చేయడమే కాదు అరెస్టు కూడా చేసింది.
భయం సృష్టించి న్యూస్క్లిక్ యూట్యూబ్ ఛానెల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తను ఉపా చట్టం కింద జైల్లో పెట్టింది. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థిగా ఉన్న ఆయన్ను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసి అనేక జైళ్లకు తిప్పింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టింది. 2022 నుండి 2024 వరకు రెండేండ్ల కాలంలో ఉపా కింద దేశంలో 10,552 మందిని అరెస్టు చేసింది. అదే సమయంలో అహ్మదాబాదు హింసాకాండలో జీవిత ఖైదు పడిన వారికి మాత్రం శిక్ష ముగియక ముందే రెమిషన్ ఇచ్చి వదిలేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఆందోళనకు ఆర్థిక సహాయం చేశారన్నది పుర్కాయస్తపై మరో ఆరోపణ. రైతులకు సాయం చేసినా అది తీవ్ర నేరమని బీజేపీ ప్రభుత్వం చెప్పదల్చింది. ఉగ్రవాదులను రైతులను ఒకే గాటన గట్టింది.
ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్ను, కేరళలో సీపీఐ(ఎం) ఒక జిల్లా కమిటీ అకౌంట్ను స్తంభింపచేయడంతో పాటు తనకు వ్యతిరేకులైన రాజకీయ నేతలపై ఆర్థిక నేరాలు మోపి ముప్పుతిప్పలు పెట్టింది. ఇద్దరు ముఖ్యమంత్రులను సైతం జైల్లో పెట్టింది. ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కొన్న వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు తమ పార్టీలను వదిలి బీజేపీలో చేరాయి. మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వారికేసులను పక్కకు పెట్టింది. ఆ ధోరణి మూడో అవతారంలోనూ కొనసాగవచ్చు. రోహిత్ వేముల కేసులో, జెఎన్యు విద్యార్థులపై దాడుల సందర్భంగా స్పందించిన స్థాయిలో పౌరహక్కుల ఉల్లంఘనలపై కాంగ్రెస్, రాహుల్గాందీ గతంలో స్పందించలేదు. లోక్సభలో పార్టీల బలాబలాలు మారిన స్థితిలోనైనా మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్లో, వెలుపలా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంత బలంగా ముందుకొస్తుందో? చూడాల్సిందే.
భారతదేశంలో నియంతృత్వం రాజ్యమేలుతున్న విషయాన్ని అంతర్జా తీయ సంస్థలు సరిగ్గానే గుర్తించాయి. ఆ సంస్థల విమర్శలకు జవాబు చెప్పలేని మోదీ ‘మా దేశంలో నియంతృత్వం లేదని, ఆదిమకాలం నుండే భారతీయుల నరనరాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లు తోందని’ ఐరాస వేదికపై సెంటిమెంటల్ డైలాగులు చెప్పారు. అదే మోదీ న్యూఢిల్లీలో గతేడాది జరిగిన జి20 దేశాల సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ను సైతం మీడియాతో మాట్లాడనివ్వలేదు. ఆయనకు వియత్నాం వెళ్లాక గానీ స్వేచ్ఛ లభించలేదు. అమెరికా అధ్యక్షుడి బలహీనత కూడా అందులో ఉన్నా మన ప్రజాస్వామ్యం ఏ పాటిదో ప్రపంచానికి చాటి చెప్పింది. వియత్నాంలో ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిరుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన రిపోర్టులో ఇండియాలో మానవ హక్కుల పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరపాల్సిన సంస్థలు అధికార బీజేపీ చేతిలో ఆయుధాలయ్యాయి’ అని అది పేర్కొంది. మానవ హక్కుల సంఘాల కార్యకర్తలపై, జర్నలిస్టులపై, విమర్శ కులపై, అలాగే ముస్లింలపై దాడులు పెద్దస్థాయిలో జరుగుతున్నాయని వెల్లడిం చింది. ముస్లింల ఆస్తులపై, ఇండ్లపై, ప్రార్థనా స్థలాలపై దాడులు చేసిన వారికి శిక్షలు కూడా పడటంలేదని ఎత్తిచూపింది.
కాశ్మీర్, మణిపూర్లోనే కాదు పంజాబ్లోనూ దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ మోడీ ప్రభుత్వం ఇంటర్నేట్ సేవలను నిలిపేసింది. అక్కడ కొన్ని చోట్ల చాలా కాలం పాటు నిలిపేస్తే కొన్ని చోట్ల స్వల్పకాలం నిలిిపేసింది. సాగుతున్న హింసాకాండ వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడి కాకుండా చూశారని ఆమ్నెస్టీ ఎత్తి చూపింది. మణిపూర్లో క్రైస్తవ ఆదివాసీలపై అమానుష దాడులు జరుగుతుండగా ప్రభుత్వం వాటిని నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ట్విట్టర్ (నేటి ఎక్స్)పై కూడా నిషేదాలు విధించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో తమను ప్రశ్నించిన వారిని సంఫ్ు పరివార్ సహించలేదు. తాము అట్టడుగు వారి కోసం ఎన్నో పథకాలు చేపట్టామని మోడీ ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేదించినప్పటికీ 2018 నుండి సివరేజి కాలువలను శుభ్రం చేస్తూ 300 మంది భారత దేశంలో చనిపోయారు. 2021లో దేశంలో రోజుకు సగటున మహిళల పై 86 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీటితో భార్య సమ్మతి లేకుండా బలత్కారం చేసిన కేసులు కూడా ఉన్నా ఎక్కువగా బలహీన వర్గాలపై బలవంతులు చేసిన అత్యాచారాలే ఎక్కువ.
జి20 సమావేశాల నేపధ్యంలో యుఎన్ మానవ హక్కుల కౌన్సిల్తో భారత్ ఒక ఒప్పందానికి వచ్చింది. దేశంలో కుల వివక్షను తొలగిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తామని, మతపర మైనారిటీల హక్కుల్ని రక్షిస్తామని భారత ప్రభుత్వం ఒప్పుకొంది. విదేశీ విరాళాల చట్టం (ఎఫ్సిఆర్ఏ) అన్ లా పుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్టు, (ఉపా), దేశద్రోహ చట్టం, నేరపూరిత పరువు నష్టం చట్టం వంటి వాటిలో ప్రజాస్వామిక సవరణలు చేస్తామని అంగీకరించింది. కాని వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు. దళితులు, ఆదివాసీలపై వేధింపులు, అత్యాచారాలు కొనసాగాయి. ముస్లింలను నేరస్తులుగా చూపడానికి మాత్రమే పౌరసత్వ చట్టంలో మార్పు చేసింది.
రాజద్రోహం కేసులన్నీ రాజకీయ దృష్టితో పెట్టినవే. అందులో సందేహం లేదు. కాగా ఆ చట్టం కింద విధించే శిక్షను ఏడేండ్ల నుండి పదేండ్లకు పెంచింది. కోర్టు తీర్పులనూ పట్టించుకోలేదు. విధాన పరమైన అంశాలపై పరిశోధన చేసే సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ లైసెన్సును ఆరు నెలలపాటు సస్పెండ్ చేసింది. ప్రముఖ మానవ హక్కుల నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి హర్షమందర్ అధ్వర్యంలో నడిచే సంస్థ అది. ఆయన నడిపే అమన్ బిరాదరి( ఇరుగు పొరుగులో శాంతి) అనే సంస్థపై కూడా విచారణకు ఆదేశించింది. సెంటర్ ఫార్ పాలసి రిసెర్చి, ఆక్స్ఫాం ఇండియా, కేర్ ఇండియా సంస్థలకు ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేసింది. దేశంలోని బలమైన మీడియా మోడీకి బంటుగా మారింది. కనుక పౌర హక్కుల సంరక్షణలో అది తన బాధ్యత నిర్వహిస్తుందని ఇప్పట్లో ఆశించలేము. అభ్యుదయ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు నేడు ముందుకొచ్చి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. కాంగ్రెస్తో సహా ‘ఇండియా’ బ్లాకులోని అన్ని పక్షాలు పౌరహక్కుల కోసం నేడు ఉద్యమాలను నిర్మించడానికి ముందుకు రావాలి.
లోక్సభలో బలాబలాలు మారిన స్థితిలో ఆర్ఎస్ఎస్ కూడా సుద్దులు మొదలెట్టింది. అహం వదులుకొమ్మని మోడీకి సుద్ది చెప్పింది. మణిపూర్ సంగతి కాస్త చూడమంది. ఇంత కాలం తాను ఎందుకు నోరు నొక్కుకొని కూర్చుందో ఆర్ఎస్ఎస్ చెప్పగలదా?
సెల్ : 9989718311
ఎస్.వినయ కుమార్