– జార్ఖండ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ కూటమి విజయంతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఘడ్ నియోజకవర్గంలో విస్తృతంగా ఆయన పర్యటించారు. రాంఘడ్ నియోజకవర్గంలోని దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్లలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం, బూత్ స్థాయి సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం తదితరాంశాలపై స్థానిక బ్లాక్ కాంగ్రెస్ నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
రాంఘడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మమతాదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, భావ ప్రకటన, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం ఉండాలని సూచించారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోపాటు స్థానిక నేతలతో కూటమి మ్యానిఫెస్టోలపై ఆయన చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎంతోపాటు ఏఐసీసీ మెంబర్ సుధాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు తారిఖ్ అన్వర్, కాంగ్రెస్ మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు షాజాద్ అన్వర్, రాంఘర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బజరంగ్ మహతో, జిల్లా అధ్యక్షులు మున్నా పాశ్వాన్ తదితరులు పాల్గొన్నారు.