మహిళల రక్షణ పోలీసుల బాధ్యత

మహిళల రక్షణ పోలీసుల బాధ్యతనవతెలంగాణ-నస్పూర్‌
సమాజంలోని మహిళల రక్షణతో పాటు వారి భద్రత విషయంలో పోలీసులు, షీ టీమ్స్‌ అత్యంత కట్టుదిట్టమైన బాధ్యత యుతంగా వ్యవహరిస్తుందని, పిల్లలు మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలపై భరోసా సెంటర్‌ వాళ్ళు చూస్తారని మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ నరేష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం నస్పూర్‌ ఏరియాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయలో విద్యార్థినులకు సైబర్‌ మోసాలు, మహిళలపై జరుగుతున్న అగాయిత్యాల, నేరాలు, ర్యాగింగ్‌, పొక్సో, ఆత్మహత్యల, మహిళా చట్టాల పై షీ టీమ్స్‌, భరోసా సెంటర్‌తో కలిసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబెట్టేది చదువు మాత్రమేనని, నిర్లక్ష్యం చేయరాదని విద్యార్థులకు సూచించారు. అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే షీ టీం, స్థానిక పోలీసులకు ధైర్యంగా ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. నేటి రోజులలో సెల్‌ ఫోన్‌ వినియోగం ఎక్కువైందని, తగ్గించుకొని చదువు పైన శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థులు చిన్న, చిన్న విషయాలకు ఆవేదనకు గురై, కృంగిపోయి, ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అలాగే యాజమాన్యం ప్రతి స్కూల్‌ ఆవరణలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్‌ఓ మౌనిక, భరోసా కోఆర్డినటర్‌ విజయ పాల్గొన్నారు.