మంత్రి సభలో ప్రొటోకాల్‌ రగడ

మంత్రి సభలో ప్రొటోకాల్‌ రగడ– సభను బహిష్కరించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో శనివారం మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్న సభలో ప్రొటోకాల్‌ వివాదం జరిగింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. వివరాల్లోకెళ్తే.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల కోసం జిల్లా ఇన్‌చార్జి, ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించగా.. ప్రొటోకాల్‌ పాటించలేదని బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సూర్ణగంటి అర్జున్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ సభలా నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారిక సమావేశంలో సభావేదికపై అతిథులను ఎవరైనా అధికారి పిలవాలి కానీ కాంగ్రెస్‌ కార్యకర్త పిలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్‌ రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, ఏనుగు రాంరెడ్డి, దీపిక శేఖర్‌ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, శివకుమార్‌, బి.రోహిణి రమేష్‌, అమిత శ్రీశైలం చారి, నిమ్మల సునీత శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.