విద్యుత్ ఘాతం తో పూరిళ్ళు దగ్ధం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు శుక్రవారం దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ తాటి నాగుల గుంపు గ్రామానికి చెందిన కుంజా మంగ సమీపంలో గల పామాయిల్ తోటలో కూలీ పనులకు వెళ్లగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి పూరిళ్ళు పూర్తిగా కాలిపోయింది. కాగా ఇంట్లో గ్యాస్ బండ ఉండటంతో గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు భయాందోళన చెందారు. గ్యాస్ సిలిండర్ పేలి పోయిన తర్వాత మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి అంతా కాలి బూడిద అయ్యాయి. మంటల్లో కౌలుకు సంబంధించిన రూ. 1 లక్ష నగదు తోపాటు, రూ.50 వేల విలువగల బీరువా, వంట సామాగ్రి, దుస్తులు కాలి పోగా బాధితురాలు కట్టుబట్టలతో మిగిలింది. బాధితురాలును సర్పంచ్ నారం రాజశేఖర్ పరామర్శించి రూ.5 వేల ఆర్ధిక సాయాన్ని అందించారు.