పీవీ గొప్ప దార్శనికుడు

– మాజీ సీఎం కేసీఆర్‌ నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నర్సింహారావు ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టిన గొప్ప దార్శనికుడని మాజీ సీఎం కేసీఆర్‌ కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలేసిన కేసీఆర్‌ దేశానికి మాజీ పీఎం చేసిన సేవలను స్మరించుకున్నారు. పీవీ తెలంగాణ బిడ్డ కావటం మనందరికీ గర్వకారణమని తెలిపారు. బహుభాషా కోవిదుడైన పీవీ తన ప్రజ్ఞా పాఠవాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణ శీలిగా ఆయన దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని నివాళులర్పించారు.