క్విట్‌ డబ్ల్యూటీవో

Quit WTO– 400 జిల్లాల్లో ట్రాక్టర్‌ పరేడ్‌, డబ్ల్యూటీవో దిష్టిబొమ్మ దహనం
– ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి నిష్క్రమించాలి : ఎస్కేఎం డిమాండ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
క్విట్‌ ”డబ్ల్యూటీవో” డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దేశంలోని 400 జిల్లాల్లో రహదారులపై ట్రాక్టర్‌ పరేడ్‌, డబ్ల్యూటీవో దిష్టిబొమ్మ దహనాలను రైతులు నిర్వహించారు. డబ్ల్యూటీవో నుంచి ఇండియా నిష్క్రమించాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన పిలుపును రైతులు సోమవారం దేశవ్యాప్తంగా జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ పంజాబ్‌ను ఏకాకిని చేసి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రయోజనం పొందాలనే ప్రయత్నంలో పంజాబ్‌ రైతులపై తీవ్ర అణచివేతకు కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హౌం మంత్రి అనిల్‌ విజ్‌ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర సరిహద్దుల గుండా బలగాలను పంపి రైతులపై బుల్లెట్లు, పెల్లెట్లు, టియర్‌ షెల్స్‌ కాల్చారని, అక్కడ నిలబడి ఉన్న వందలాది రైతుల ట్రాక్టర్లను ధ్వంసం చేశారని విమర్శించారు. అనంతరం రైతులను రోడ్లపైకి ట్రాక్టర్లను తీసుకురావద్దని ఆదేశించారని దుయ్యబట్టారు. రైతుల ఆస్తుల కూల్చివేతకు బుల్డోజర్‌ రాజ్‌ వంటివి ఆచరిస్తున్నారని, ఈ రైతు వ్యతిరేక దాడిని నిరసిస్తూ ఎస్కేఎం రోడ్లపై ట్రాక్టర్లను నిలబెట్టి నిరసన సభలు నిర్వహించిందని తెలిపారు.
సి2 ప్లస్‌ 50 శాతం లాభదాయక రేటుతో ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, చౌకైన రేషన్‌ దేశంలోని రైతులు, శ్రామిక జనాభా మనుగడకు ఉమ్మడి అవసరాలని ఎస్కేఎం నాయకులు వివరించారు. మతపరమైన ముసుగులో కప్పబడిన ప్రభుత్వ విధానం, వ్యవసాయంలో విదేశీ పెట్టుబడిని, బడా కంపెనీలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ”ఇన్‌పుట్‌ ధరలను పెంచుతోంది. పంటల అమ్మకపు ధరలను తగ్గించడం, ఆహార సరఫరా గొలుసును నియంత్రించడం, భూమి, నీటి వనరులను స్వాధీనం చేసుకోవడం, తద్వారా రైతు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది” అని విమర్శించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేయడమే కాక, ధనిక దోపిడీదారుల లాభార్జన అవసరాల కోసం ప్రజలపై ఫాసిస్ట్‌ అణచివేతకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు.
కనీస మద్దతు ధర విధానాన్ని ఉపసంహరించుకోవాలన్న డబ్ల్యూటీవో డిమాండ్‌ దేశంలోని కోట్లాది మంది రైతులపై దాడి మాత్రమే కాదని, దేశ సార్వభౌమాధికారంపై కూడా దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశంపై రుద్దబడుతున్నాయని, రైతులకు, దేశ పౌరుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ కిసాన్‌ మహాపంచాయత్‌ను నిర్వహించనుందని, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొననున్నారని తెలిపారు.
డబ్ల్యూటీవో నుంచి బయటకొస్తేనే… :ఏఐకేఎస్‌, ఏఐఎడబ్ల్యూయూ నేతలు కృష్ణప్రసాద్‌, బి వెంకట్‌
దేశ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే డబ్ల్యూటీవో షరతులను భారత ప్రభుత్వం ప్రతిఘటించాలని ఏఐకేఎస్‌ కోశాధికారి కృష్ణ ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. అబుదాబిలో జరుగుతున్న డబ్ల్యూటీవో సదస్సులో భారత ప్రభుత్వం సంపన్న దేశాల షరతులను అంగీకరించరాదని అన్నారు. సోమవారం దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై ట్రాక్టర్‌ పరేడ్లు, డబ్ల్యూటీవో దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం జరిగింది. హర్యానాలోని రోహతక్‌లో జాతీయ రహదారులపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ ప్రసాద్‌, బి. వెంకట్‌ మాట్లాడుతూ గత నాలుగేండ్లుగా కనీస మద్దతు ధరల చట్టం కోసం రైతాంగం రోడ్లెక్కారని, అన్ని వర్గాల ప్రజలు వారితో భుజం భుజం కలిపి పోరాడుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ డబ్ల్యూటీవో పెట్టే షరతులను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని, కాని భారత ప్రభుత్వం వారి షరతులను పాటించేందుకు సిద్ధమవ్వటం విచారకరమని అన్నారు. దేశంలో వ్యవసాయానికి, ప్రజా పంపిణీకి సబ్సిడీలు తగ్గించటం, విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల సుంకాలను తగ్గించడం లాంటి విషమ షరతులు అందులో ఉన్నాయని అన్నారు. ఇప్పటికే దేశం వ్యవసాయ రంగ సంక్షోభంలో ఉందని, సబ్సిడీలు తగ్గిస్తే మరింత సంక్షోభంలోకి కూరుకుపోయి వ్యవసాయ రంగంపై ఆధారపడిన 65 కోట్ల మంది ప్రజల జీవితాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు.
అమెరికా లాంటి సంపన్న దేశాలు వ్యవసాయ సబ్సిడీలు తగ్గించాలని గగ్గోలు పెడుతున్నాయని అన్నారు. వాస్తవానికి మూడు శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడిన అమెరికాకు 80 శాతం సబ్సిడీలు ఇస్తున్నాదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సగం కేటాయింపులు తగ్గించారని, దీనితో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి పోయే ప్రమాదం ఉందని అన్నారు. భారత దేశ ప్రజల అవసరాలకు తగిన వ్యవసాయ ఉత్పత్తులు పండించకుండా అడ్డుపడి సంపన్న దేశాల్లో వృథాగా ఉన్న ఉత్పత్తులను మన దేశానికి డంపు చేయడానికి అమెరికా కుట్ర పన్నుతున్నదని అన్నారు.
అమెరికా ప్రజలు తినకుండా వదిలేస్తున్న, అమెరికాలో వథాగా ఉన్న చికెన్‌ లెగ్స్‌ను భారతదేశానికి దిగుమతి చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 30 శాతం దిగుమతి సుంకాలు ఉన్న చికెన్‌ లెగ్‌ పీసులకు మోడీ ప్రభుత్వం ఐదు శాతానికి కుదించిందని అన్నారు. చికెన్‌ లెగ్‌ పీస్‌లు విపరీతంగా దిగుమతి అవటంతో మన దేశంలో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. మన వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తే వ్యవసాయదారులంతా దానికి దూరం అవుతారని, వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కబళించి కార్పొరేట్‌ శక్తులు, అదాని లాంటి వారికి అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం సర్వవిదాలా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. దేశంలోని కార్పొరేట్‌ శక్తులు, సంపన్న దేశాల అధినేతలు కలిసి భారతదేశం లాంటి వెనకబడిన దేశాల వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. అటువంటి నిర్ణయాలు చేసేందుకే డబ్ల్యుటిఓ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. డబ్ల్యుటిఓ విషమ షరతులకు భారతదేశం అంగీకరిస్తే భారత వ్యవసాయ రంగం బ్రతకదని, షరతులను ప్రతిఘటించక పోతే మోడీ గద్దె దిగటం ఖాయమని హెచ్చరించారు.