ప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం. బి.కో యురు, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్, ఎస్డిసి సినీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగుతుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్తో మెప్పించారు. ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచింది. శనివారం ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్.. ‘రేజ్ ఆఫ్ తీక్షణ’ను మేకర్స్ విడుదల చేశారు. ‘రణరణమున రధము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి.. కుత్తుకల కోట కూల్చే తీక్షణా.. కణకణమున యుద్ధ నీతి, కనికరమే లేని యువతి క్రూర కథల కత్తివేటు తీక్షణా..’ అంటూ సాగే ఈ ఎనర్జిటిక్ సాంగ్లో తీక్షణ తను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే తీరుని రేజ్ ఆఫ్ తీక్షణ పాట రూపంలో వివరించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతం పెద్దపల్లి రోహిత్ అందించగా, హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య ఆలపించారు. శక్తి గ్రఫిస్టే క్రియేట్ చేసిన లిరికల్ వీడియో కూడా ఆకట్టుకునే యానిమేషన్తో, ఆసక్తికరమైన మేకింగ్ వీడియోతో రూపొందించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒరియా వంటి ఏడు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.