– మూడు గంటలు మాత్రమే అనుమతి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఇటీవల కుంగుబాటుకు గురైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని పరిశీలించేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ గురువారం వెళ్లనున్నారు. ఈమేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా రాహుల్గాంధీ అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్యలోనే బ్యారేజీని పరిశీలించేందుకు రాహుల్కు అనుమతి ఇచ్చారు. ఉదయం ఆయన హెలికాప్టర్లో లక్ష్మిబ్యారేజీ సమీపంలోని అంబటిపల్లి గ్రామంలో ల్యాండ్ కానున్నారు. ఇదిలా ఉండగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ నేత శశిభూషణ్ కాచే ఎన్నికల అధికారికి బుధవారం వినతిపత్రం సమర్పించారు.