ఒట్టొవా : కెనడాలో గురువారం నుంచి రైల్వే ఉద్యోగుల సమ్మె ప్రారంభమయింది. కెనడా నేషనల్, ది కెనడా పసిఫిక్ కన్సాస్ సిటీ సదరన్ అనే రెండు సంస్థలకు చెందిన 9,000 మంది ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో కెనడా రైల్వేతో పాటు ఉత్తర అమెరికా ఆర్థికవ్యవస్థ పై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికా-కెనడా మధ్య రైల్ మార్గంలో ఎగుమతి అయ్యే సరకుల్లో మూడోవంతు ఈ సంస్థలే తరలిస్తాయి. ఫలితంగా అమెరికాలోని వ్యవసాయ, ఆటోమొబైల్, గహనిర్మాణ, ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా చేయడంలో తీవ్ర అవరోధాలు ఏర్పడనున్నాయి. ఈ సమ్మెను ఆపేందుకు ఇప్పటికే కెనడా కార్మిక శాఖ మంత్రి, ఆ సంఘాలు, సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా-కెనడా పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడటంతో ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంజిన్లు, ట్రాన్స్మిషన్లు, ఇతర పరికరాల సరఫరా తగ్గితే అమెరికాలోని ఆటోమొబైల్ పరిశ్రమలు కూడా తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కెనడా సరిహద్దుల్లో నిర్వహించే వాటర్ టీట్ర్మెంట్ ప్లాంట్లకు క్లోరిన్ సరఫరా కూడా నిలిచిపోనుంది. రోడ్డు మార్గంలో ఈ సరకును రవాణ చేయడానికి తగినన్ని ట్రక్కులు అందుబాటులో లేవు. అండర్సన్ ఎకనామిక్ గ్రూప్ అంచనాల ప్రకారం మూడు రోజుల్లో 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. అదే వారంపాటు ఈ ఆందోళన కొనసాగితే బిలియన్ డాలర్లు ఆర్థికనష్టం వాటిల్లనుంది. ఈ సంస్థలు సమ్మెలోకి వెళ్లనున్న నేపథ్యంలో గత వారం నుంచే ప్రమాదకరమైన కెమికల్స్ సరఫరా ఆర్డర్లను తీసుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. కెనడా నేషనల్(సిఎన్), ది కెనడా పసిఫిక్ కన్సాస్ సిటీ సదరన్ (సిపికెసి) సంస్థలు ఏకకాలంలో సమ్మెకు దిగడం ఇదే తొలిసారి. 2022లో సిపికెసి సంస్థ 60 గంటలు మూతపడింది. ఇక 2019లో సిఎన్సంస్థ దాదాపు తొమ్మది రోజులపాటు సమ్మె కారణంగా పని చేయలేదు.