– పోటీ పరీక్షల పేపర్ లీకేజ్ బిల్లు సైతం
– జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
– అలాగే రాష్ట్ర హోదా కల్పించాలి
– పార్లమెంట్ సమావేశాలు ఒక రోజు పొడిగింపు
– ఆ రోజు కాంగ్రెస్ ఆర్థిక పాలనపై శ్వేత పత్రం విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) జాబితా సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. అందులో ఏడు రాజ్యసభలో, నాలుగు లోక్సభలో ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఎస్సీ, ఎస్టీల జాబితాను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభ రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు, 2024, రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు, 2024ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. మొదటి బిల్లు ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించాలని కోరగా, రెండో బిల్లు ఒరిస్సాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించాలని పేర్కొన్నది. అలాగే నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) సవరణ బిల్లు 2024ను కూడా రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకాశ్మీర్ర్లో ఎస్సీ రాజ్యాంగ సవరణ బిల్లు, ఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్లోని స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా బిల్లుకు లోక్సభ ఆమోదం
జమ్మూ కాశ్మీర్లోని స్థానిక సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 2019లో 370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంలో కీలక మార్పులు చేపట్టినట్టు ప్రభుత్వం చెప్పింది. జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల చట్టం (సవరణ) బిల్లు-2024పై చర్చకు కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు సమాధానమిస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు కేంద్రపాలిత ప్రాంత ప్రజలు చవిచూస్తున్నారని చెప్పారు. కాగా, జమ్మూ కాశ్మీర్లోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు టైమ్లైన్ను డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల (సవరణ) బిల్లు, 2024పై చర్చలో పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ హస్నైన్ మసూది మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెప్పారని మసూది గుర్తు చేశారు. ఇతర పెద్ద టిక్కెట్ల నిర్ణయాలు తీసుకోకముందే కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. టీఎంసీ ఎంపీ సౌగతా రారు కూడా సుప్రీంకోర్టు పరిశీలనను ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు లేవనెత్తారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రాష్ట్ర హౌదా ఇవ్వడంపై ప్రభుత్వం ”స్పష్టమైన” సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల (సవరణ) బిల్లు అక్కడ ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) న్యాయం చేస్తుందని బీజేపీ ఎంపీ జుగల్ కిషోర్ శర్మ అన్నారు. వైసీపీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ ఇది ప్రగతిశీల చట్టమని, పంచాయతీలతో సహా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఇది దోహదపడుతుందని అన్నారు.
పోటీ పరీక్ష పేపర్ లీక్ బిల్లు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లు-2024’కు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీన్ని పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లను సృష్టించినా గరిష్ఠంగా పదేండ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా పడనుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్డీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్, జెఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశపరీక్షలకూ వర్తిస్తుంది.
పార్లమెంట్ సమావేశాలు ఒక రోజు పొడిగింపు
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఒక రోజు అదనంగా పొడిగించనున్నారు. పదేండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో ఆర్థిక నిర్వహణ శ్వేత పత్రాన్ని శనివారం విడుదల చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈ శ్వేత పత్రం విడుదల చేసేందుకే ఈ సమావేశాలను ఒక రోజు పొడిగించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమై న బడ్జెట్ సమావేశాలు ఈనెల 9తో ముగియనున్నాయి. అయితే, 10వ తేదీ వరకూ సమావేశాలను పొడిగించనున్నారు.
పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచనే లేదు
పీఎం కిసాన్ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచుతారంటూ ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్లో ఆ మేరకు ప్రకటన ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. కానీ, అలాంటిదేమీ లేకుండానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసింది. తాజాగా ఈ నిధుల పెంపు గురించి పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతనిస్తూ పీఎం- కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదని తెలిపింది. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి రూ.12 వేలకు పెంచే ఉద్దేశమేదీ లేదని స్పష్టం చేశారు. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు. 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు. పీఎం-కిసాన్ అందుకున్న రైతుల్లో ఏపీ నుంచి 43 లక్షలు మంది, తెలంగాణ నుంచి 30 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు అందిస్తున్నారు.