బాన్సువాడ లో మిషన్ భగీరథ కార్మికుల ర్యాలీ 

– సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్
– మెగా ఇంజనీర్ కి వినతి పత్రం 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ (బాన్సువాడ) 
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ , మెగా సంస్థ ఇంజనీర్ కు వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మెగా సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ తో వెళ్లి వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా  ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులు ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కరం అవుతాయని అన్నారు. సిఐటియు  యూనియన్ లో చేరిన మెగా కంపెనీ నిర్వాహకులు కార్మికులకు వేధింపులకు గురి చెయ్యొద్దని ప్రత్యేకంగా  కోరారు.  మిషన్ భగీరథ కార్మికుల వేతనాల పెంపు, జీవో నెంబర్ 60 లేదా జీవో 11ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ స్కీంలో ఎలక్ట్రిషన్, ఆపరేటర్స్, వాల్వ్ ఆపరేటర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, వాచ్మెన్, సూపర్వైజర్, తదితర హోదాల్లో పనిచేస్తున్నారని. మిషన్ భగీరథ స్కీమ్ లో సుమారు 16 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. భగీరథ కార్మికుల శ్రమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతులు వచ్చాయని. కార్మికుల స్థితి ఏమాత్రం బాగోలేదు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్నారు. మిషన్ భగీరథ  పథకం నిర్వహణకు తీసుకున్న కంపెనీలు కార్మికుల పొట్ట కొడుతున్నాయని. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీని ఫలితంగా మిషన్ భగీరథ కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చే ఎస్ఎస్ఆర్ రేట్లు 18 వేలకు పైగా చూపిస్తున్నారు. కానీ కార్మికులకు మాత్రం 8500 నుండి 12 వేల రూపాయల లోపు మాత్రమే వేతనం చెల్లించడం చాలా దుర్మార్గం ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించిన ఎస్ఎస్ఆర్ రేట్లు 18 వేలకు పైగా గలదు. కాని కార్మికులకు అతి తక్కువగా వేతనాలు ఇస్తున్నారని అన్నారు. గతంలో సిపిడబ్ల్యూ స్కీమ్ ను ప్రస్తుతం మిషన్ భగీరథగా మార్చారు. సిపిడబ్ల్యూ స్కీంగా కొనసాగుతున్నప్పుడు కార్మికులకు జీవో నెంబర్ 11 అమలు అవుతుందన్నారు. ప్రస్తుతం జీవో ఎంఎస్ నెంబర్ 11 భగీరథ స్కీంలో పనిచేసే కార్మికులకు అమలు చేయడం లేదు.. -కార్మికులు జీవో నెంబర్ 11 అమలు చేయాలని పట్టుబడుతున్నారు. లైన్మెన్ల పరిస్థితి కడు దరిద్రంగా ఉన్నది. వచ్చే 8500 వేతనంలో పెట్రోల్ అలవెన్స్ కిందనే సుమారు 3000 రూపాయలు ఖర్చవుతుంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నీళ్ళు అందించడం అనేది భగీరథ స్క్రీంలోనే జరుగుతుంది. ఇది చట్ట విరుద్ధం. వెంటనే లైన్మెన్లకు ట్రావెల్ అలవెన్సులు చెల్లించాల్సిందిగా కోరుతున్నాము. స్క్రీంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరుతున్నాము. మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
1. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. 2. ఉద్యోగ భద్రత, 20 శాతం బోనస్, రక్షణ పరికరాలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ నేరుగా డిపార్ట్మెంట్ జమ చేయాలి. సంవత్సరానికి 15 రోజులు వేతనంతో కూడిన సెలవులు, అమలు చేయాలి.3 కార్మికులకు టి ఏ లు ఇవ్వాలి 4 ప్రతి ఆదివారం పనిచేస్తున్న ఆబ్సెంట్ వేస్తున్నారు అది ఎత్తివేయాలి  5 వేతనాలు సకాలంలో చెల్లించని కంపెనీలను బ్లాక్ లిస్టులో ఉంచాలి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. జీవో నెంబర్ 60 లేదా జీవో నెంబర్ 11 అమలు చేయాలి. కంపెనీలు కాకుండా మిషన్ భగీరథ స్కీమ్ నుండే నేరుగా జీతభత్యాలు కార్మికులకు చెల్లించే విధానాన్ని రూపొందించాలి. ఎనిమిది గంటల పని అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కలిల్, రవీందర్,  మిషన్ భగీరథ అధ్యక్షుడు రూప్ సింగ్ , కార్యదర్శి పండరి బాల్రాజ్, మొగులయ్య, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు