పది లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి: జిల్లా విద్యాశాఖాధికారి రామారావు

నవతెలంగాణ – పెద్దవంగర: పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రామారావు అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలను పెద్దవంగర, తొర్రూరు నోడల్ హెచ్ఎం లు బుధారపు శ్రీనివాస్, మహంకాళి బుచ్చయ్య లతో కలిసి సందర్శించారు. పాఠశాల పలు రికార్డులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గత సంవత్సరం కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రధానోపాధ్యాయులు పని చేయాలన్నారు. విద్యార్థులు 10వ తరగతిలో పాసైతేనే జీవితంలో మెరుగైన స్థితిలో ముందుకు సాగుతారని తెలిపారు. గతంలో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో వనరులు మెరుగు పడ్డాయని, విద్యార్థులు ఎంత వెనకబడి ఉన్నా మెరుగైన శిక్షణ ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలగుతారన్నారు. వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని, ప్రతీ విద్యార్థి పాస్‌ అయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిన విద్యార్థులు ఫెయిలైతే అది ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణం అన్నారు. గత ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రయత్నించాలన్నారు. తన శిష్యుడు ఉన్నత స్థానానికి వెళితే గురువులు ఎంత గౌరవంగా భావిస్తారో, అదే ఫెయిలైతే అంతే అవమానంగా భావించాలన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు అత్యధిక శాతం మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లోనే వెనుకబడి ఉన్నారని, ఆలాంటి వారిపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఫలితం ఉంటుందని సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ఎక్కువగా స్లిప్‌ టెస్టులు, మాక్‌ టెస్టులు నిర్వహించి వాటిపై రివిజన్‌ చేస్తే విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షల భయం పోతుందన్నారు. రివిజన్‌ చేస్తే విద్యార్థులు మరిచిపోరని తెలిపారు. ప్రాక్టీస్‌ ఎక్కువగా చేయించేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ వేక్ అప్ కాల్ చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల వెనుకబాటుపై చర్చించి వారికి తగు సూచనలు చేయాలన్నారు. కార్యక్రమంలో రమేష్, కోటేశ్వర్, సురేందర్, శివకుమార్, ప్రభాకర్, ఆంజనేయులు, యుగేందర్, గీతా, అరుణ, కరుణ, సీఆర్పీ లు వేముల సంతోష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.