గణేష్ మండపాల నిర్వాహకులతో రామగిరి పోలీసుల సమావేశం

నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండల కేంద్రంలో మంథని సీఐ గడిగొప్పుల  సతీష్ ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు.. సమావేశంలో జరగనున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగిరి మండలంలో వినాయక పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని తెలిపారు. అనుమతి కోసం మీసేవ  కేంద్రం లో లేదా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన త‌రువాత‌ అనుమతులు మంజూరు చేస్తామని  తెలిపారు.  ఎలక్ట్రిసిటీ శాఖ నుంచి ముందుగా పొందిన అనుమతి పత్రాలతో పాటు  అన్ని వివరాలు ఉన్న అర్జీని అందించాలని వెల్లడించారు. పండుగ రోజు నుంచి జరిగే ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాటించాలని తెలిపారు.
నియమ నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలు 
వినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి, ఊరేగింపునకు తప్పని సరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటుకు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ పోలీస్ అధికారిని  మండపాల ఆర్గనైజింగ్ కమిటీ వారికి 24 గంటలు అందుబాటులో ఉంటారనీ, ఆర్గనైజింగ్ కమిటీ వారికి ఏవిధమైన సమస్య, సందేహాలు వచ్చినా మీ గ్రామ పోలీస్ అధికారిని గానీ,  పోలీస్ స్టేషన్ లో  గానీ, లేక డయల్ 100 సంప్రదించాలని  సూచించారు. మండపాల వద్ద శబ్ధ కాలుష్యం లేకుండా ఉండే విధంగా స్పీకర్లను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఎట్టిపరిస్థితులలోను ఉపయోగించరాదనీ. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలని అన్నారు. అలాగే మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలనీ,విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, భద్రత కోసం రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపల ఉండాలి. మండపాల వద్ద ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రతి పందిరి వద్ద నిర్వహకులు సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు, ఏర్పాటు చేసుకోవాలని, మండపం పటిష్టతను దృష్టిలో ఉంచుకుని పూజ నిర్వహించే సమయంలో మండపంపై ఎక్కువ మంది జనం లేకుండా  చూడాలన్నారు.
ఫ్లెక్సీలు రోడ్డుపై పెట్టరాదు
విగ్రహ పందిళ్ళ చుట్టుప్రక్కల వాహనాలను పార్కింగ్ చేయరాదనీ,పందిళ్ళకు దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని,  వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని, రోడ్డుపైన ఉండరాదన్నారు. అలాగే బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు రోడ్డుపైన పెట్టరాదు, వినాయక పందిళ్ళ వలన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదనీ,పరిసర ప్రాంతాల్లో అనుమానిత కొత్త వ్యక్తుల సమాచారం గురించి గానీ వదలి వేసిన వస్తువుల గురించి గానీ ఉత్సవ నిర్వాహకులు వెంటనే పోలీసు వారికి తెలియజేయాలన్నారు.
అర్జీదారుడిదే బాధ్యత
విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో రంగులు చల్లడం, లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదనీ, ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు ఎక్కువ శబ్ధం వచ్చే వాయిద్యాలు అనగా డీజే అనుమతించరాదన్నారు. అదేవిధంగా పందిళ్ళ వద్ద ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరగకుండా  మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలన్నారు. అలాగే విగ్రహ ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదనీ, నిమజ్జన ఊరేగింపునకు  అనుమతించిన సమయం, రూటు కచ్చితంగా పాటించవలెననీ, ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు భద్రత కోసం తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు కార్యనిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్సై కటికే రవి ప్రసాద్  ఉమెన్ ఎస్ఐ పి.దివ్య పాల్గొన్నారు.