రామ్‌ నయా సినిమా షురూ..

Ram's new movie Shuroo..రామ్‌ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సినిమా గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్‌ 22వ చిత్రమిది. ఇందులో రామ్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తున్నారు. హీరో రామ్‌ పోతినేని, హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్‌ మలినేని కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, మరో దర్శకుడు హను రాఘవపూడి క్లాప్‌ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మహేష్‌ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలితో పాటు ఆ సంస్థ సీఈవో చెర్రీ స్క్రిప్ట్‌ అందజేశారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ విజయం తర్వాత దర్శకుడు మహేష్‌ బాబు ఫీల్‌ గుడ్‌ అండ్‌ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న చిత్రమిది. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కటి కథ, కథనంతో సినిమా రూపొందుతోందని దర్శక, నిర్మాతలు అన్నారు.