– ఇరిగేషన్తో పాటు పలు శాఖల్లో వీఆర్ఏల సర్దుబాటు : ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
– కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
– నేడు వీఆర్ఏలతో చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ), జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)కు రాష్ట్ర సర్కారు తీపి కబురునందించింది. నాలుగేండ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న జేపీఎస్లను క్రమబద్ధీకరిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి వీఆర్ఏలను నీటిపారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని పర్యవేక్షించడం, పలు రకాల బాధ్యతలను రాష్ట్ర సర్కారు అప్పగించిన విషయం విదితమే. నాలుగేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న కార్యదర్శుల పనితీరును జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనున్నది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలలో మూడింట రెండు వంతులకు చేరుకున్న వారిని రెగ్యులర్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. అందుకు సంబంధించిన పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని సీఎం కేసీఆర్ కొనియాడారు. జాతీయ అవార్డులు సాధించడంలో వారి పాత్ర మరువలేనిదన్నారు. గ్రామాల్లో మరింగ గుణాత్మక మార్పు తీసుకొచ్చేలా, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయతీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
వీఆర్ఏలతో చర్చలకు కేటీఆర్ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం
రాష్ట్రంలో పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను, వారి విద్యార్హతలు, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకు గాను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్లతో కూడిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుని వీఆర్ఏల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉప సంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం వారంలోపు పూర్తి కావాలని ఆదేశించారు.