రాజుకుంటున్న పబ్లిక్ క్లబ్ రాజకీయం..

– లెక్కల్లో మోసాలు జరిగాయని ఆర్డీవోకు ఫిర్యాదు
– బాద్యులపై విచారణ జరపాలని అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్
– చర్చనీయాంశంగా మారిన క్లబ్ వ్యవహారం
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ రాజకీయం రాజుకుంటోంది. ప్రధానంగా పాత జాతీయ రహదారి కి, పాత వ్యవసాయ మార్కెట్ యార్డుకు, పాత బస్టాండ్ కు ఆనుకుని ఉన్న పబ్లిక్ క్లబ్ ఆదాయ పరంగా లక్షలు ఆర్జిస్తోంది. కాగా క్లబ్ కింద పాత బస్టాండ్ తో పాటు 48 షాపులు, పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాలు తదితర ఆస్తులు ఉన్నాయి. వీటి ద్వారా క్లబ్ కు నెలకు రెండు లక్షలకు పైగానే ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో ఆదాయం, లావాదేవీల విషయంలో మోసాలు, అవకతవకలు జరిగాయంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన క్లబ్ సభ్యులు గురువారం ఆర్డిఓ వీరబ్రహ్మ చారి కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పబ్లిక్ క్లబ్ లొల్లి మరోమారు బహిర్గతమైంది.కాగా గత 2014 లో బి.ఆర్.యస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత పబ్లిక్ క్లబ్ వ్యవహారం రచ్చ రచ్చ అయిన విషయం తెల్సిందే.ఇక అప్పటి నుండి అడపాదడపా క్లబ్ లెక్కపత్రాలపై సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం వరకు పలుమార్లు విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. కాగా ఈ క్రమంలో పరిశీలిస్తే 2009 లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా దామోదర్ రెడ్డి సన్నిహితుడు కొప్పుల వేణారెడ్డి  కొనసాగుతూ వచ్చారు. అనంతరం 2014 లో జరిగిన ఎన్నికలో బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీశ్ రెడ్డి  గెలుపొందారు.ఆ క్రమంలో పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా ఆయా పదవులకు రాజీనామాలు చేశారు.కాగా వేణా రెడ్డి మాత్రం బైలా ప్రకారం తనకు క్లబ్ కార్యదర్శిగా కొనసాగే హక్కు ఉందంటూ కోర్టును ఆశ్రయిస్తూ కార్యదర్శిగా కొనసాగిన విషయం తెలిసిందే.అనంతరం ఆనాడు అధికార పార్టీలో ఉన్న కట్కూరి గన్నారెడ్డి  క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ నియామకం చెల్లదంటూ వేణా రెడ్డి కోర్టుకు వెళ్లారు.అప్పుడు బ్యాంకులో ఉన్న 42 లక్షలు కోర్టు తీర్పు వచ్చేంత వరకు విడుదల చేసేది లేదని బ్యాంక్ అధికారులు ఆనాడు సీజ్ చేశారు.ఈ క్రమంలో క్లబ్ కు కూడా తాళం వేశారు.కొద్దీ రోజుల తర్వాత  గన్నారెడ్డి కార్యదర్శి గా కొనసాగారు.ఆ తర్వాత జరిగిన పరిణామాలలో పెద్దిరెడ్డి గణేష్ కార్యదర్శి గా  కొనసాగుతూ వస్తున్నారు.కాగా గత కొంతకాలంగా క్లబ్ లో లెక్కల వ్యవహారం తో పాటు క్లబ్ లో గల పంక్షన్ హల్ లీజ్ కు సంబంధించిన 11 లక్షల రూపాయల వ్యవహారం వివాదాలకు కేంద్రంగా మారింది. అడపాదడపా ఈ వ్యవహారాల పై విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. పబ్లిక్ క్లబ్ లో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహాపై విచారణ జరపాలని, పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీ ని నియమించాలని క్లబ్ మెంబర్స్ కొంతమంది బహిరంగంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో క్లబ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సభ్యుల మధ్య  రాజకీయ వేడి రాజుకుంటుంది. పబ్లిక్ క్లబ్ కార్యవర్గం పై సమగ్ర విచారణ చేసి కార్యదర్శి, కోశాధికారులపై చర్యలు తీసుకోవాలని సీనియర్ సభ్యులు నూకల సుదర్శన్ రెడ్డి,బొల్లెద్దు దశరధ,బైరు శైలేందర్,శనగాని రాంబాబు గౌడ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ క్లబ్ కు ప్రతి నెలా దుకాణాల అద్దె, ఆడిటోరియం అద్దెల ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని, కాని ప్రస్తుత కార్యదర్శి అక్రమాలకు పాల్పడ్డారని, నిధులను స్వాహా చేయడంతో పాటు, క్లబ్ కు సంబంధం లేని  కార్యక్రమాలు నిర్వహిoచి లక్షలాది రూపాయలు స్వాహా చేశారని వారు ఆరోపిస్తున్నారు. సమావేశాలు పెట్టకుండా ఆదాయం, ఖర్చులు చెప్పకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ, నిధుల దుర్వినియోగం చేశారని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుత కమిటీ ని రద్దుచేసి నూతన కమిటీ ఏర్పాటు చేయాలని, క్లబ్ నుండి అక్రమంగా డబ్బులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ రకంగా క్లబ్ వ్యవహారం రచ్చ కెక్కింది. ఇందులో బి.ఆర్.యస్ పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు కూడా అధికార పార్టీతో కలిసి గళం ఎత్తడం గమాన్హారo. మరి ఈ క్రమంలో పబ్లిక్ క్లబ్ వ్యవహారం మున్ముందు ఎంత వరకు దారితీస్తుందో వేచిచూడాలి.