– నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఏప్రిల్ నుండి పెరిగిన వీడిఏ పాయింట్లు అమలు చేయాలని, అలాగే బకాయి ఉన్న రెండు నెలల ఏరియర్స్ డబ్బులు వెంటనే ఇవ్వాలని నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) సీఐటీ యు డిమాండ్ చేసింది. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పను సీఐటీయు అధ్యక్షులు ఎం.వెంకటేష్తో పాటు యూనియన్ నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు ఎం. వెంకటేష్ మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నుంచి పెరిగిన వీడీఏ పాయింట్లను వెంటనే అమలు చేయాలని, బకాయి ఉన్న రెండు నెలల ఏరియర్స్ (ఏప్రిల్, మే) డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల రోజు చేసిన డ్యూటీ డబ్బులను వెంటనే ఇవ్వాలని, లేబర్ డిపార్టు మెంట్లో జరిగిన ఒప్పందం ప్రకారం రిటైర్మెంట్ అయిన కార్మికులకు వైద్య సౌకర్యం వెంటనే కల్పించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సెమి స్కిల్డ్ పోస్టులు, రాసే పనిలో అన్ స్కిల్డ్గా పనిచేస్తున్న కార్మికులలో చదువు కుని అర్హత కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈ.నర్సింహులు వెంకట్, మాధవి తదితరులు పాల్గొన్నారు.