నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తింది. ‘రూల్స్ రంజన్’ నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. చిత్ర కథ, దానికి అనుగుణంగా సాగే సన్నివేశాలు, వాటికి తగ్గట్లుగా సంభాషణలు, వీటన్నింటినీ స్థాయిని పెంచే రీతిలో నేపథ్య సంగీతం, సందర్భానుసారంగా సాగే పాటలు అమితంగా ఆకట్టుకుంటాయన్నారు.