ఈ దేశంలో ఇప్పుడు అధికారంలో ఉండి, ప్రజలకు తప్పుడు సమాధానాలు ఇస్తున్న వారెవరూ? ప్రస్తుత పాలకులే! మతాన్ని ఒక తప్పుడు సమాధానంగా ప్రజల ముందుకు తేవడం-పైగా, ప్రశ్నించిన వారిని జైలుకి పంపడం, లేదా చంపేయడం చేస్తున్నారు. అంతకన్నా ఈ పదేండ్ల కాలంలో వీరు సాధించింది ఏముందీ? కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ”ప్రజలకు నిజమైన ఆనందాన్ని అందివ్వాలంటే భ్రమలు కల్పించే మతాన్ని రద్దుచేయాలి. భ్రమలు పోవాలని కోరడమంటే, ఆ భ్రమలు కలిగించే పరిస్థితుల్ని మనం మార్చు కోవాలి!” అని! అబ్బే! మన దేశ నాయకులకు ఇలాంటి మాటలు చెవికెక్కవు, ఎక్కినా, అస్సలు అర్థంకావు ”భారతదేశానికి దేవుడిచ్చిన బహుమానం – మోడీ” అని అన్నారు వెంకయ్య నాయుడు. ఆయన దేశానికి ఉపాధ్యక్షుడయ్యాడు. మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి మరింత రెచ్చిపోయి ”మోడీి రాముడు కృష్ణుడు లాగ దేవుడి అవతారమని” పొగిడాడు. ”దేవతల రాజు మోడీ”- అని అన్నది ఎవరో కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా. ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలని ఈ దేశ ప్రజలను కుంటే- దానికి బీజేపీ వారి ప్రమేయం లేదు. వీరికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా? అని దేశ ప్రజలు అనుమాన పడుతున్నారు. పోనీ ఒక దార్శనికుడి గురించి కొంచెం ఎక్కువగా చెపుతున్నారులే-అని సర్ది చెప్పుకుందామంటే అది కూడా కాదాయె. ఎవరి గురించి చెపుతున్నారో ఆయనకు చదువు, సంస్కారం, ఆలోచన ఏదీ లేదు కార్పోరేట్లకు పాలేరు!
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా అన్నారు! ”మోడీ కాకపోతే ఇంకెవరూ? అని అడుగుతారు. గత ఐదేండ్లలో ఆయనేం చేశారో చూడండి. ఐదుకోట్ల ఉద్యోగాలు పోయాయి. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్, లోక్పాల్, సిబిఐ, సివిసి, ఎన్.ఐ.ఏ, మీడియా- అన్నింటినీ వశపరచుకున్నారు. మూకదాడులు, ద్వేషపూరితమైన అసత్య వార్తా ప్రసారాలు, కలుషితమైన సామాజిక మాధ్యమాలు ఎన్నని చెప్పుకోవడం? ఇంకా మరో ఐదేండ్లు గనక పొరపాటున వారికి అవకాశం ఇస్తే-వేల వేల ఏండ్లుగా సాధించుకున్న నాగరికతను వదిలేసుకోవడం జరుగుతుంది. మళ్లీ మూడువేల ఏండ్ల నాటి జీవపరిణామ దశలకు వెళ్లి పోవాల్సిందే!” మతాన్ని బూచిగా చూపుతూ పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎవడి పైసలతో వాడే బ్యాంక్ ఎకౌంట్ తెరిస్తే దాని పేరు ‘జన్ధన్’-ఎవడి ఇల్లు వాడే ఊడ్చుకుంటే దానికి ‘స్వచ్ఛ భారత్’ ఎవడి పిల్లని వాడే కని పెంచుకుంటే దానికి ‘బేటీ బచావ్ బేటీ పడావ్’ – అని పేరు. ఆ పిల్ల కోసం ఎకౌంట్లో పైసలు దాస్తే-దానికే ‘సుకన్య సమృద్ధి యోజన’ అని పేరు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రజలకేం చేసినట్టో? ఈ మాత్రం దానికి పిచ్చివాళ్ళంతా గంతు లేస్తూ తప్పెట్లూ తాళాలతో ప్రచారాలు చేస్తున్నారయే. ఈ దేశ ప్రజలు ప్రాణాలకు భలే మోపయ్యారు వీరంతా! హిందూ మతోద్ధారకులు!!
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా 14 మంది భారత ప్రధానుల కాలంలో దేశానికి యాభై ఆరు లక్షల కోట్ల అప్పు తెచ్చారు. మోడీ వచ్చాక అతనొక్కడే చేసిన అప్పు ఎనభై లక్షల కోట్లు. పోనీ ప్రాజెక్టులు కట్టారా?-లేదు. ఉపాధి పెరిగిందా?- లేదు. నిరుద్యోగం పెరిగిందా?- అవును. రూపాయి విలువ పడిపోయిందా?-అవును. హంగర్ ఇండెక్స్లో భారత దేశం చివరికి చేరిందా?-అవును. ఇంత సిగ్గుచేటుగా ఉంటే మోడీ ప్రభుత్వం హిందుత్వ పేరుతో కాలయాపన చేస్తూ ఉంది కదా? బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న దేశాలు కూడా హంగర్ ఇండెక్స్లో భారతదేశం కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. గుడ్డిగా మోడీ భజన చేసేవారు, అభివృద్ధిని పక్కకుతోసి మతాన్ని పట్టుకుని వేలాడేవారు విషయాలు వివరంగా తెలుసుకోవడం అవసరం. ఇలాంటి వారిని చూసి కాబోలు ప్రపంచ ప్రసిద్ధ రచయిత మార్క్ట్విన్ అన్నాడు.”అజ్ఞానంతో కూడిన ఆత్మవిశ్వాసం విజయానికి దారితీస్తుంది” అని! అజ్ఞానులకు, మూఢులకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నాం కదా! ప్రస్తుత పాలకుల్నీ? ”మత మార్పిడులకు పాల్పడుతున్న అక్రమ చర్చ్లను తక్షణం బుల్డోజర్లతో కూల్చేయాలని” కర్నాటక -శ్రీరామ సేన ఛీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఒక కార్య్నకమంలో మాట్లాడుతూ అన్నారు. వేలాది మంది హిందువులను బలవంతంగా క్రైస్తవంలోకి మారుస్తున్నారనీ-మత మార్పిడులను ప్రోత్సహిసున్న చర్చ్లన్నింటినీ కూల్చేయాలన్నది- చట్టం చేయాలని ఆయన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకప్పుడు బౌద్ధ దేశంగా వర్ధిల్లిన ఈ దేశాన్ని నాశనం చేసి, పరమ ఛండాలంగా, పరమ కిరాతకంగా తయారు చేసిన వైదిక మతం గురించి మాట్లాడరెందుకూ? విషయాలు తెలుసుకోకుండా మోడీ, మోడీ భక్తులు తాము ‘శూద్రుల’మని మరిచిపోయి బ్రాహ్మనిజానికి పల్లకీ మోయడం అవసరమా? శతాబ్దాలుగా అణచివేతకు గురైంది చాలదా? స్పృహలోకి వచ్చే పనే లేదా? ”నా కులం గొప్పది నా మతం గొప్పది అనే వాడిని చూసి కోపం తెచ్చుకోకండి! వాణ్ణి చూసి జాలిపడండి. ఎందుకంటే వాడొక మానసిక రోగి”-అని అన్నారు డా.బి.ఆర్. అంబేద్కర్.
ఎంత పెద్ద గణిత శాస్త్రజ్ఞులయినా తేల్చలేని మోడీ లెక్కలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇలా ఉంది. మోడీ పుట్టింది 1950. ఇల్లు విడిచి పారిపోయింది 1971. వాద్ నగర్ రైల్వేస్టేషన్ ప్రారంభమైంది 1973. ఆయన టీ – అమ్మిన సంవత్సరం ఏదీ? కనుక్కోండి చూద్దాం. రైల్వేస్టేషన్ ప్రారంభం కాకముందే ఆయన అక్కడ టీ-అమ్మానని చెప్పారు. దేశంలో ఇ-మెయిల్ లేని రోజుల్లోనే ఆయన ఇ-మెయిల్స్ పంపారట ఆరో తరగతిలో స్కూల్లో పేరు తీసేస్తే – కనబడకుండా పోయినవాడు కరన్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో- గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తను హైస్కూలు వరకు చదువు కున్నానని చెప్పాడు. అంతటితో ఆగాడా ప్రధాని అయ్యే సరికి ఒక యం.ఎ. డిగ్రీ సృష్టించు కున్నాడు. అబద్దాలకు లెక్కా పత్రం ఉండవు కదా? సరే, మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి, మన భారత ప్రధానుల-విద్యార్హతలు చూద్దాం!
1.జవహర్ లాల్ నెహ్రూ- యం.ఎ (కేంబ్రిడ్జ్) లా (లండన్) 2. లాల్ బహుదూర్ శాస్త్రి- బి.ఎ (ఫిలాసఫీ)బనారస్ 3. ఇందిరాగాంధీ – హిస్టరీ -పొలిటిక్స్ (ఆక్స్ఫర్డ్) 4. మొరార్జీ దేశారు-బి.ఎ. (బొంబాయి) ఐ.సి.యస్ 5. చౌదరీ చరణ్ సింగ్-బియస్సి; యం.ఎ; ఎల్.ఎల్.బి (ఆగ్రా) 6. రాజీవ్ గాంధీ-బి.ఎ(కేంబ్రిడ్జి) పైలట్ కోర్సు (ఢిల్లీ) 7. వి.పి.సింగ్ – బి.ఎ; బియస్సి; ఎల్.ఎల్.బి. (అలహాబాద్/పూనా) 8. చంద్రశేఖర్ – బి.ఎ (అలహాబాద్). 9. పి.వి. నరసింహారావు-బి.ఎ. (ఉస్మానియా) యం.ఎ. (నాగపూర్) 10. హెచ్.డి. దేవగౌడ్ – సివిల్ ఇంజనీరింగ్ (బెంగళూరు) 11. ఐ.కె. గుజ్రాల్ – యం.ఎ. (లాహోర్). 12. అటల్ బిహార్ి వాజ్పారు-యం.ఎ.(ఆగ్రా) 13. మన్మోహన్ సింగ్-ఆర్థిక వేత్తః బి.ఎ. (పంజాబ్) యం.ఎ. (కేంబ్రిడ్జి), పిహెచ్.డి (ఆక్స్ఫర్డ్) 14. నరేంద్ర మోడీి-అధికారికంగా తెలియదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ)లో మినహాయింపు పొందారు. కేవలం అబద్దాలు మాత్రమే మాట్లాడుతూ, నైతికంగా దిగజారి దొంగ యం.ఎ. డిగ్రీ తెచ్చుకున్నాడని తెలుసుకున్న ఈ దేశ ప్రజలు అతణ్ణి విజ్ఞుడిగా, దార్శనికుడిగా ఎలా గుర్తిస్తారు?
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆరెస్సెస్- బీజేపీ పాలకులు- ఈ దేశం సెక్యులర్ దేశం అన్నది గుర్తించరు. అసలు ప్రకృతిలోనే సెక్యులర్ లక్షణాలు ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోగల స్థాయి వారికి లేదు. ఉదాహరణకు చూడండి. నేల మీద పాకే చీమ నుంచి నింగి వైపు ఎదిగిన మహావృక్షందాకా, నింగిలో విహరించే పక్షి నుంచి నీటిలో ఈదే చేపదాకా అన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానం చేయబడ్డవే. జీవులన్నీ ఒకటే-జీవవైవిద్యమంతా ఒకటే- జీవుల్ని జీవవైవిద్యాన్ని కాపాడుకోవడంలోనే మనిషి వివేకం ఉంది. ఒక్క మనిషే బతకాలి. మిగతా జీవులన్నిటినీ నాశనం చేయాలి-అని అనుకోవడం మూర్ఖ లక్షణం. బతకడమూ-బతకనివ్వడమూ అవసరం. సామాజిక, రాజకీయ పరిపాలనా రంగాల కైనా – ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక దేశంలో అందరూ ఒక్క భాషే మాట్లాడాలి. ఒక్క తిండే తినాలి. ఒక్క ఆలోచనే చేయాలి. ఒక్క జై శ్రీరామనే అనాలి-అన్నది మూర్ఖుల సిద్ధాంతం. ఏ ఒక్కటీ ఒకటిగా మనలేదు. అది ప్రకృతి ధర్మం! ఏ ఒక్క దేశమూ ఇతర దేశాల సహాయ సహకారాలు లేకుండా అభివృద్ధి సాధించలేదు. ఇతర భాషా పదాలు కలుపుకోని భాష, ఏదీ లేదు. ప్రతి జీవికీ సమయానికి ఆహారం కావాలి. నిజమే! కానీ ఒక్కో జీవికి ఒక్కో ఆహారం అవసరమౌతుంది. అందరూ ఒకలాంటి తిండే తినాలంటే కుదరదు. తినాలని శాసిస్తే అసలే కుదరదు. ఒక్క జైశ్రీరామ్ అంటే కుదరదు. ఉత్తర భారతదేశంలోనే చాలా ప్రాంతాల్లో జై సీతారామ్/సియారామ్-అని అంటారు. సీత లేని రాముడి అస్తిత్వాన్ని ఒప్పుకోరు. ఈ దేశంలో మూర్ఖుల సంఖ్య అధికం గనక, భార్యను తన్ని తగిలేసిన వాణ్ణి ప్రధానిగా ఒప్పుకున్పారు. అయితే, మూర్ఖుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది!
ఈ దేశానికి నెహ్రూ చూపించిన వైజ్ఞానిక స్పృహ-మార్గాన్ని వదిలేసిన ప్రస్తుత ప్రధాని నేతృత్వంలో ఏం జరుగుతుందో చూడండి. చరిత్ర పాఠ్య పుస్తకాల్లో రామాయణం, భారతం, వేదాలు, ఆయుర్వేదం వంటి వాటికి చోటు కల్పించినట్లు ఎన్.సి.ఇ.ఆర్.టి చైర్మన్ సి.ఐ. ఐజాక్ ప్రకటించాడు. 7 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఇవి నేర్పిస్తూ, వారిలో దేశభక్తిని పెంపొందిస్తామని – అన్నాడు. దేశభక్తి లేకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతున్నారని వాపోయాడు. ఉద్యోగావకాశాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టలేక పోయిన, ఛైర్మన్ నుంచి అంతకన్నా ఏమాశించ గలం? కేంద్రానికి వత్తాసు పలికాడని అర్థం చేసుకోవాలి! అసలు రామాయణ మహాభారతాలు భారతీయ సంస్కృతి ఎలా అయ్యాయీ – వాటికి దొరికిన ఆధారాలేమిటో చెప్పాలికదా? అది చేతకాదేం?
తమిళనాడు రాష్ట్రంలో అన్ని థియేటర్లలలో సినిమా ప్రారంభంలో- భారత రాజ్యాంగం ద్వారా సుమారు వందకోట్ల మంది ఈ దేశ ప్రజల బానిస సంకెళ్లను తెంపిన మహావ్యక్తి డా.బి.ఆర్.అంబేద్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశించారు. ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతులూ అవుతున్నారన్నది గ్రహించాలి. అణగారిన వర్గాలకు అధికారం వస్తే ఇలా సమాజాన్ని జాగృతం చేసే నిర్ణయాలు తీసుకుంటారు. మరి కొందరు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ కార్పోరేట్లకు ఊడిగం చేస్తుంటారు. ఈ దేశంలోని సామాన్య ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ఇక నాయకులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ”రాహకె సత్తర్ సె బడ్ కె / కుచ్ నహీ హై మంజిలే / రాస్తే ఆవాజ్ దేతీహై / సఫర్ జారీ రఖోఁ ” అంటే- దీని అర్థం- దారిలో ఉన్న రాళ్ళ కంటే/ ఎక్కువేం కాదు – గమ్యాలు/ ప్రయాణం కొనసాగిస్తుండమని/రహదారులు పిలుస్తున్నారు!” ఏమీ అయిపోలేదన్న ఆశాభావం పైకవితా పంక్తుల్లో కనిపిస్తోంది. ఈ దేశ ప్రజలు తమ ప్రయత్నం, తమ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. దారిలో మైలు రాళ్ళలాగా పరిపాలకులు వచ్చిపోతుంటారు. మతాన్ని పక్కనపెట్టి, అభివృద్ధిపై దృష్టి పెట్టే నాయకుల్ని ఎన్నుకోవాలి!
– కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్ర వేత్త
(మెల్బోర్న్ నుంచి)
– డాక్టర్ దేవరాజు మహారాజు