‘మత’ రాజకీయ ప్రకటనలు !

'మత' రాజకీయ ప్రకటనలు !– ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు కోట్లలో చెల్లింపులు
– సింహభాగం బీజేపీకే
– ఆ పార్టీకి అనుకూలంగా అదృశ్య ఖాతాలు
– విద్వేషాలు రెచ్చగొట్టడమే వాటి లక్ష్యం
న్యూఢిల్లీ : ఈ నెల 7న లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ జరగడానికి రెండు వారాల ముందు మెటా వేదికల్లో రాజకీయ ప్రకటనల కోసం పేరొందిన 20 ప్రచార సంస్థలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు రూ.17 కోట్లు చెల్లించాయి. వీటిలో కనీసం 30 ప్రకటనలు మతపరమైనవి. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వీటిని ఉద్దేశించారు. ఏప్రిల్‌ 23-మే 6 తేదీల మధ్య జరిపిన చెల్లింపుల్లో కేవలం ఐదు మాత్రమే రాజకీయ పార్టీల నుంచి జరిగాయి. మిగిలిన పదిహేను స్వయం ఉపాధి పొందుతున్న వారు జరిపిన చెల్లింపులే. ఇవి అదృశ్య ఖాతాల నుంచి జరుగుతుంటాయి. ఇవి ఎవరివో తెలుసుకోవడం అసాధ్యం. వీరందరూ తమ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల నుండి రాజకీయ ప్రకటనలు ఇచ్చారు.
బీజేపీ ఖర్చే అధికం
మూడో దశ పోలింగ్‌కు రెండు వారాల ముందు మెటా వేదికల్లో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ అత్యధికంగా రూ.5.63 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ రూ.4.81 కోట్లతో రెండో స్థానంలో ఉంది. బిజూ జనతాదళ్‌ (బీజేడీ) తన అనుబంధ పేజీ అయిన ‘అమా చిన్హా సంకా చిన్హా’ నుండి ప్రకటనల కోసం రూ.2.15 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ అనుకూల ప్రకటనలు ఇచ్చే చరిత్ర కలిగిన ఫిర్‌ ఏక్‌బార్‌ మోడీ సర్కార్‌, మనమోడీ పేజీలను నిర్వహించే గుర్తు తెలియని ఖాతాల నుండి రూ.57.64 లక్షలు, రూ.42.17 లక్షల చెల్లింపులు జరిగాయి. తెలుగుదేశం (రూ.32.16 లక్షలు), తృణమూల్‌ కాంగ్రెస్‌ (రూ.23.84 లక్షలు) కంటే ఈ అదృశ్య (గుర్తు తెలియని) ఖాతాల నుండే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరగడం విశేషం. కాంగ్రెస్‌, బీజేడీ, తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పెట్టిన ప్రకటనల ఖర్చును మినహాయిస్తే మిగిలిన చెల్లింపుల్లో అధిక భాగం బీజేపీకి మద్దతు ఇస్తున్న సంస్థలు చేసినవే.
అదృశ్య ఖాతాల నుంచి అనుకూల ప్రకటనలు
ఏప్రిల్‌ 19న జరిగిన తొలి దశ పోలింగ్‌కు ముందు కూడా అనేక గుర్తు తెలియని సంస్థలు మెటా వేదికల్లో బీజేపీ అనుకూల ప్రకటనలు ఇచ్చాయి. వాటిలో చాలా వరకూ మతపరమైనవే. మెటా నిబంధనల ప్రకారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రాజకీయ ప్రకటనలు ఇచ్చే వారు ముందుగా తమ ఫోన్‌ నెంబర్లు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెంబరుతో ఉన్న ఫోన్లన్నీ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడం గమనార్హం. నిబంధనలను తరచూ ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తామని మెటా ప్రతినిధి తెలిపారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు ఇచ్చే రాజకీయ ప్రకటనలు మెటా విధానాలను ఉల్లంఘించడం లేదు. అందువల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బీజేపీ కర్నాటక రాష్ట్ర శాఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఓ పోస్ట్‌ పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని దాని సారాంశం. ఈ వీడియోను తొలగించాలంటూ ఎక్స్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆ వీడియోను ఎక్స్‌ తొలగించింది. మెటా వేదికల్లో వచ్చిన బీజేపీ అనుకూల ప్రకటనల కోసం రూ.27.6 లక్షలు ఖర్చు చేశారు. బీజేపీ అనుకూల ప్రకటనలు నడిపే ‘సిద్ధ ఛష్మా’ అకౌంట్‌ కూడా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ ఓ యాడ్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ 24-27 తేదీల మధ్య ఈ ప్రకటన వచ్చింది. దీనికి లక్షలాది హిట్లు కూడా వచ్చాయి. వీటిపై సిద్ధ ఛష్మా రూ.16 లక్షలు ఖర్చు చేసింది. ముద్దే కీ బాత్‌ పేరుతో ఉన్న మరో పేజీలో కూడా ఈ ప్రకటన వచ్చింది. మొత్తంగా బీజేపీ అనుకూల ప్రకటనల కోసం సిద్ధ ఛష్మా రూ.31.64 లక్షలు, ముద్దే కీ బాత్‌ రూ.21.4 లక్షలు ఖర్చు చేశాయి.
తప్పుదోవ పట్టించే వీడియోలు
ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఇస్తున్న ఈ ప్రకటనల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే విషయాలు ఉంటున్నాయి. వీటిలో వక్రీకరించిన పాత వీడియోలు కూడా ఉంటాయి. వీటిని సామాజిక మాధ్యమాలలో కూడా షేర్‌ చేస్తున్నారు. ఉదాహరణకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సంబంధించిన ఓ పాత వీడియోను తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముస్లింలకు ఇస్తున్న 4శాతం రిజర్వేషన్లను తొలగించడంపై ఆయన అందులో మాట్లాడారు. దీనిని ఎడిట్‌ చేసి ఎస్సీలు, ఎస్టీలు సహా అన్ని వర్గాలకూ ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన చెప్పినట్లు చూపారు. ఈ వీడియోను షేర్‌ చేసిన ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ఏఐ సాయంతో..
గత నెలలో ప్రముఖ హిందీ నటులు అమీర్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ల నకిలీ వీడి యోలు (డీప్‌ఫేక్స్‌) సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌కు ఓటేయాలని వారు కోరినట్లు ఆ వీడియోల్లో ఉంది. కృత్రిమ మేథ (ఏఐ) పరిజ్ఞానం సాయంతో వీటిని మార్ఫింగ్‌ చేశారు. ‘న్యాయం కోసం ఓటే యండి… కాంగ్రెస్‌కు ఓటేయండి’ అనే కాంగ్రెస్‌ నినాదంతో ఈ వీడియో ముగుస్తుంది. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.