29లోగా బీ కేటగిరీ సీట్ల భర్తీ

– ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులను స్వీకరించాలి
– ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు నోటిఫికేషన్‌ ఇవ్వాలి
– మెరిట్‌ ప్రకారమే అభ్యర్థులకు సీట్లివ్వాలి
– మార్గదర్శకాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రయివేటు (మైనార్టీ, నాన్‌మైనార్టీ) ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లను ఈనెల 29లోగా భర్తీ చేయాలని యాజమాన్యాలను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులను స్వీకరించాలని కోరింది. మూడు దినపత్రికల్లో (ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ) ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ బుధవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రతిరోజూ కాలేజీలోని నోటీసు బోర్డులో, వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని తెలిపారు. ఇంటర్మీడియెట్‌లో 45 శాతం (రిజర్వుడు కేటగిరీ వారికి 40 శాతం) మార్కులొచ్చిన విద్యార్థులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో, 30 శాతం సీట్లు బీ కేటగిరీలో భర్తీ అవుతాయని వివరించారు. ఇందులో నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ) కోటా కింద 15 శాతం, యాజమాన్య కోటా కింద 15 శాతం సీట్లు భర్తీ చేయాలని పేర్కొన్నారు. బీ కేటగిరీలోని సీట్ల వివరాలను బ్రాంచ్‌ల వారీగా ప్రకటించాలని ఆదేశించారు. జేఈఈ మెయిన్స్‌, ఎప్‌సెట్‌ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు ఎంపిక చేయాలని వివరించారు. ఇంకా సీట్లు మిగిలితే ఇంటర్‌లో మార్కుల ఆధారంగా సీట్లివ్వాలని తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి మెరిట్‌ ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని కోరారు. బ్రాంచ్‌ వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించాలని సూచించారు. భర్తీ చేసిన వివరాలను ఉన్నత విద్యామండలికి వచ్చేనెల పదో తేదీలోగా పంపించాలని సూచించారు.
ప్రయివేటు కాలేజీల్లో సీట్ల భర్తీ పూర్తి
ఇప్పటికే కొన్ని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిసింది. డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) అనుబంధ బ్రాంచ్‌ల్లో విద్యార్థులు చేరినట్టు సమాచారం. కాలేజీని బట్టి రూ.పది లక్షల నుంచి రూ.18 లక్షల వరకు డొనేషన్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బేరసారాలు పూర్తయినట్టు సమాచారం. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డేటాసైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సీఎస్‌ఈ ఐవోటీ, ఐటీ వంటి కోర్సులకు డిమాండ్‌ ఉన్నది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కాలేజీ యాజమాన్యాలు సీట్లు అమ్మినట్టు తెలిసింది. ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను బట్టి పత్రికల్లో నోటిఫికేషన్లు ఇవ్వడం, విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించడం నామమాత్రమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీట్లు కేటాయించిన విద్యార్థుల జాబితాను నిబంధనల ప్రకారం ఉన్నత విద్యామండలికి పంపిస్తాయి.