నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ రోడ్లపై గుంతలు-వాటి పూడ్చివేతకు తీసుకున్న చర్యలపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గుంతల వివరాలు జనం చెప్పడానికి వీలుగా ఒక యాప్ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చింది. ఆ యాప్లో గుంతల పూడ్చివేత వివరాలతోపాటు ఆలస్యమైతే ఆ వివరాలు కూడా పొందుపర్చేందుకు వీలుంటుందని సూచించింది. ఈ యాప్ విధానం కర్ణాటకలో అమలవుతోందని చెప్పింది. రోడ్లపై గుంతలు, మ్యాన్హౌళ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు చనిపోయిన కుటుంబసభ్యులకు పరిహారం ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ లాయర్ అఖిల్ శ్రీగురుతేజ వేసిన పిల్ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. ఈనెల 31కి వాయిదా వేసింది.