కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత?

కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత?– ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీశ్‌రావు మంతనాలు
– ఉగాది పండుగ తర్వాత అధికారికంగా ఖరారు
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత పేరు దాదాపు ఖరారైంది. కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ నేతలతో అధినేత కేసీఆర్‌ ఇవాళ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నివేదిత, క్రిశాంక్‌, గజ్జెల నగేష్‌ సహా ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై నేతలతో చర్చించిన కేసీఆర్‌.. వారికి దిశానిర్దేశం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కూడా జరగనుంది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు నేతల సమావేశంలో నివేదిత పేరు చెప్పినట్టు సమాచారం. ఉగాది తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశముంది.