– ప్రయివేటు వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీలో చట్టం తెస్తాం
– వాటి మార్గదర్శకాలపై సమగ్ర విచారణ
– ‘మన ఊరు-మనబడి’ నిధుల వినియోగంపైనా విచారణ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలుచేయకుండా ప్రయివేటు విశ్వవిద్యాలయాలు ఇష్టారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి అన్నారు. వాటి మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సచివాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కనీ, రాష్ట్రంలోని ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంటు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదికను ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మౌలికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రయివేటు విశ్వవిద్యాలయాలు ఎలా అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలన్నారు. ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషన్ అయిన భూములను, ధరణిలో చూపించినా వాటిలో ప్రయివేటు వర్సిటీలకు అనుమతిని ఇచ్చారని చెప్పారు. అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నారని ప్రశ్నించారు. ఇండ్ల స్థలాల కింద రిజిస్టర్ అయిన, వివాదంలో ఉన్న భూముల్లో విశ్వవిద్యాలయాలకు అనుమతులివ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వాటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విశ్వవిద్యాలయాలకు అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధుల వినియోగానికి సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని కోరారు. ఇలాంటి అన్ని అంశాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.