రేవంత్‌రెడ్డివన్నీ అబద్ధాలే

– ఆయనకెవ్వరో స్క్రిఫ్టు తప్పు రాసిచ్చారు :మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెదక్‌లో మాట్లాడినవన్నీ అబద్ధాలేననీ, ఆయకెవ్వరో స్క్రిప్టు తప్పు రాసిచ్చారని బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో ఓడిపోతే మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయొద్దా? కొడంగల్‌లో ఓడిపోతే మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డి పోటీచేయలేదా? అని ప్రశ్నించారు. ఇక్రిశాట్‌, బీడీఎల, బీహెచ్‌ఈఎల్‌, ఐడీపీఎల్‌ సంస్థలు ఇందిరాగాంధీ హయాంలో వచ్చాయన్నది పచ్చి అబద్ధమన్నారు. 1980లో ఇందిరా గాంధీ మెదక్‌లో గెలిస్తే మెదక్‌ రైల్వే లైన్‌ తెస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పదేండ్లలో మెదక్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించారని తెలిపారు. మోడీ పదేండ్ల అభివృద్ధి చర్చించేందుకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్‌ దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్న హామీ ఏమైందని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బీసీలకు ఇస్తామన్న లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు. క్యాబినెట్‌లో ఎంతమంది బీసీ మంత్రులున్నారు? ముదిరాజ్‌ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమొచ్చినా రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు దొంగ మాటలు చెప్పి దుబ్బాకలో తను దెబ్బకొట్టారనీ, తాను ఓడిపోలేదని చెప్పారు. రాష్ట్రానికి నిధుల అవసరం కోసం ప్రధాని మోడీని బడేభారు అని ఇప్పుడేమో నోటికొచ్చినట్టు తిట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆగస్ట్‌ 15 నాటికి రైతు రుణ మాఫీ చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.