నాలా పనుల ప్రగతిపై సమీక్ష

– నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్‌ ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాలా పనులపై మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సమీక్షించారు. నగరంలో వరద ముంపు నివారణకు చేపట్టిన ఎస్‌.ఎన్‌.డీ.పీ. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్‌ గద్వాల్‌ విజ యలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జోనల్‌ కమిషనర్లు, ఎస్‌.ఎన్‌.డీ.పీ.సీ.ఈలతో మేయర్‌ గూగుల్‌ మీట్‌ ద్వారా నాలా పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా మేయర్‌ మాట్లాడుతూ వరద నివారణకు ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా చేపట్టిన పెండింగ్‌లో ఉన్న పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జోన్‌లో 9 పనులు మంజూరు కాగా 3 పనులు పూర్తయ్యాయనీ, మిగతా పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని మేయర్‌ ఎస్‌.ఎన్‌.డీ.పీ అధికారులను ఆదేశించారు. వాటర్‌ వర్క్స్‌, సీవరేజ్‌ ఆయా శాఖల సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సికింద్రాబాద్‌ జోన్‌ అంబర్‌పేట్‌ సర్కిల్‌ హిమాయత్‌నగర్‌ పరిధి లో మినర్వా కాఫీ షాప్‌ నుంచి తెలుగు అకాడమీ వరకు రూ. 56.05 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యం లో 20 మీటర్ల మంచినీటి పైప్‌ లైన్‌, సీవరేజ్‌ పునరుద్దరణ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీర్‌ను ఆదేశించారు.