వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ..

– ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన ఐదుకు ఏపీ క్యాబినెట్‌ ఓకే
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు క్యాబినెట్‌ ముందుంచారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైనా మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. గంజాయి నివారణకు హౌంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హౌం, రెవెన్యూ, హెల్త్‌, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ ఉండనున్నారు.