– లండన్ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి
– రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కుదిరిన ఒప్పందం
– మరిన్ని దశల్లో చర్చలకు అంగీకారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ సిటీకి ఆ ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకొస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు సీఎం లండన్లో శుక్రవారం పర్యటించారు. థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సీఎం నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్రాభివృద్ధి కార్యక్రమాలను రేవంత్్రెడ్డికి అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ వివరించారు. అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ ఈ సందర్భంగా చర్చించారు. తన విజన్ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముఖ్యమంత్రి, లండన్ అధికారులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దాని సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చినట్టు అక్కడి అధికారులు వివరించారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే రెవిన్యూ మోడల్ను ఎంచుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలను ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్టమైన సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిపేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రపాలీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకట రమణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఓవైసీతో కలిసి లండన్ షార్డ్ను సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి
ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి సీఎం రేవంత్రెడ్డి లండన్ షార్డ్ను శుక్రవారం సందర్శించారు. లండన్ అర్బన్ లేఔట్, అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 72 అంతస్తుల పైభాగం నుంచి 309 మీటర్ల పొడవున్న థేమ్స్ నది లండన్ ఉత్తర వైపున్న ప్రాచీన నగరాన్ని పశ్చిమ భాగంలో ఉన్న ఆధునిక లండన్ను ఎలా కలుపుతుందో పరిశీలించారు.