ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనాను అధిగమించామని గొప్పలకు పోతున్న భారత్ ప్రజలందరికీ పోషకాహారం అందిస్తోందా? జనాభాకు తగిన వనరులున్నప్పటికీ వాటిని సరిగా వినియోగి స్తోందా? దేశంలో ఆకలిచావులు ఎందుకు పెరుగుతు న్నాయి? అంతటి జనాభా ఉన్న చైనాలో అందరికీ సరిపడే పోషకాహారం అందించినప్పుడు మనదేశానికి ఎందుకీ సమస్య ఎదురవుతున్నది? ప్రజలు ఆలోచిం చాల్సిన సందర్భమిది.1945లో ఐక్యరాజ్య సమితిలోని ‘ఆహార, ఆరోగ్య సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)’ వ్యవ స్థాపక దినాన్ని పురస్కరించుకుని 1979లో ఐరాస తీర్మానం ప్రకారం 1981 నుండి 150కి పైగా దేశాలలో ప్రతి యేటా 16 అక్టోబర్న విశ్వ వ్యాప్తంగా ‘ప్రపంచ ఆరోగ్య దినం (వరల్డ్ ఫుడ్ డే)’ పాటిస్తున్నది. ఆహార భద్రతకు సంబంధించిన ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్’ వేదికలు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తాయి. అయిన ప్పటికీ పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య, మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా 99 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడటం, అది పాలకుల వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నది. ప్రపంచ మహిళల్లో అరవై శాతం ఆకలి/రక్తహీనత సమస్యలతో, ఇరవై మిలియన్ల శిశు మరణాలు తక్కువ బరువువల్ల జరుగుతున్నాయని సర్వేల ద్వారా తేలింది. పోషకాహార లోపంతో ఐదేండ్లలోపు పిల్లలు యాభై శాతం చనిపోతున్నారనేది చాలా విచారకరం. పేదరికం, కరువులు, ఆకలిచావులు, అవిద్య, అధిక జనాభా, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలు ఆహార భద్రతకు విఘా తాలుగా చాలా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆహార లభ్యతకు ఆధారం వ్యవసాయమే. ఆహారంతో ఆరోగ్యం, విద్య ముడిపడిఉంటాయి. ఈసారి ప్రపంచ ఆహార దినం-2024 థీమ్గా ”ఆహార హక్కు, ఉన్నత జీవితానికి ఉన్నత భవిష్యత్తు (రైట్ టు ఫుడ్ : ఫర్ ఏ బెట్టర్ లైఫ్ అండ్ ఏ బెట్టర్ ఫ్యూచర్)”ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, సెమినార్లు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి, పంపిణీ, భద్రతలను శాస్త్రీయంగా చేయాల్సి ఉంటుందనే అంశాలపై చర్చిస్తారు. కానీ, పోషకాహార నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయనేది వాస్తవం.
నేడు అందరికీ పోషకాహారం కనీస హక్కు అందని ద్రాక్షగా మారింది. ఆహార కొరత, ఆకలిచావులు జాతికే అవమానకరం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో ఆహార భద్రత సమస్య ఎండమావిలా వెంటాడుతోంది. కరోనా వైరస్ కల్లోల కాలంలో పోషకాహారమే ఏకైక అవసరమని, సమతుల ఆహారం తోనే రోగనిరోధకశక్తి పెరుగుతుందని విన్నాం. ఆహార కొరత నుండి బయటపడడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు, ఆహార ధాన్యాలను సమర్థవంతంగా సకాలంలో ప్రజలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు దోహదపడతాయి. ఆహార పదార్థాలలో బియ్యం, పప్పులు, పండ్లు, మాంసాహారం, చేపలు, గుడ్లు, కూరగాయలు, దుంపలు, తృణధాన్యాలు, చిక్కుల్లు, కాఫీ, టీ వంటివి వస్తాయి. ప్రపంచీకరణ, పట్టణీకరణ, ఆధునిక ఆహారపు అలవాట్లు, పెరిగిన ఆదాయాలు వంటి అంశాలు కూడా ఆహార భద్రతను ప్రభావితం చేస్తున్నాయని ఐరాస ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
దీన్ని అధిగమించడం ఎలా? అనే సందేహం సహజమే. అయితే, మనదేశంలో మాత్రం ఆహార ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశన్నం టుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అస్పష్ట జాతీయ విధానాలు, అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యల్ని అధిగమించే చర్యల పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. అధిక జనాభా తగిన వనరుల్ని సరిగా ఉపయోగించకపోవడంతో ఈ సమస్య మరింత ఉత్పన్న మవుతున్నది. కరువు కాటకాలు, అనారోగ్యం, పర్యా వరణ కాలుష్యం, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, పంపిణీలో లోపాలు, మార్కెట్లు అందుబాటు లో లేకపో వడం, రవాణా, సాంఘీక సమస్యలు లాంటి సమస్యలు ఆహార కొరతకు కారణాలుగా నిలుస్తున్నాయి. గ్రామీణ వ్యవసాయానుబంధ మౌలిక వసతుల కల్పనకు తగినంత కృషి లేకపోవడంతో ఆహార భద్రత నేడు ప్రశ్నార్థకంగా మారింది. మద్దతు ధర, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు చేయూత, చిన్న సన్నకారు రైతుల కు వ్యవసాయ పెట్టుబడి సకాలంలో అందించడం, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడం, రవాణా వ్యవస్థను కల్పించడం లాంటి చర్యలు ఆహార కొరతను తగ్గిస్తాయి.
ఆకలిగా ఉన్నపుడు కడుపు నింపడానికి ఆహారం తీసుకోవడం మాత్రమే ఆరోగ్యానికి పరిష్కారం కాదని, మనం తీసుకునే ఆహారం సమతుల పోషకాలతో నిండి ఉండాలనేది అతి ముఖ్యమని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆకలింపు చేసుకొని ఆకలిచావులు లేని సంపన్న భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో పాలకులు ముందుకు సాగాలి. ప్రజల్ని అందులో భాగస్వామ్యుల్ని చేయాలి.
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037