నేడు అమిత్‌షా..30న ప్రధాని రాక

– 3,4 తేదీల్లోనూ రాష్ట్రంలో మోడీ పర్యటనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణపై బీజేపీ మరింత ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం ఇక్కడికి రానున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలోని సిద్దిపేటలో నిర్వహించే విశాల జనసభలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 30న బీజేపీ జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌, మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌ రావుకు మద్దతుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఆందోల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న విశాల జనసభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అదేరోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులతో ఆయన భేటీఅయ్యే అవకాశముంది. ఈ పర్యటన అనంతరం మే నెల 3, 4తేదీల్లో కూడా మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 3న వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ నిర్వహించబోయే మరో సభలో ఆయన పాల్గొంటారు. నాలుగో తేదీన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని నారాయణపేటలో, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలోని వికారాబాద్‌ సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు పలుమార్లు ప్రధాని తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత ఆయన తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి. గురువారం కరీంనగర్‌లో బండిసంజరు, నాగర్‌కర్నూల్‌లో భరత్‌ ప్రసాద్‌ నామినేషన్ల కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేందర్‌ పటేల్‌ పాల్గొననున్నారు.