బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం రూ.42 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక మాజీ మహిళా కార్పొరేటర్ చెందిన భవనంలోని పరుపు కింద దాచి ఉంచిన ఈ భారీ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని మాజీ కార్పొరేటర్, ఆమో భర్త సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు.
ఆర్టీ నగర్లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరుపు కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లగా లెక్కగట్టారు. అయితే కొంత కాలం నుంచి ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించట్లేదని సమాచారం. ఈ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు పూర్తి విచారణ చేపడుతున్నారు.