అక్టోబర్‌ 21 నుంచి ‘ఎస్‌ఏ-1’ పరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చేనెల 21 నుంచి ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అదేనెల 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి బుధవారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌లోనూ ఎస్‌ఏ-1 పరీక్షల నిర్వహణ వివరా లను ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ రెండున జవాబుపత్రాల మూల్యాం కనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలిపారు. అదేనెల ఐదున విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అదేనెల 16న తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాన్ని నిర్వహించాలనీ, విద్యార్థుల మార్కులు, వారి ప్రతిభపై చర్చించాలని కోరారు. అక్టోబర్‌ రెండు నుంచి 14 వరకు 13 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు దసరా సెలవులుంటాయి. వచ్చేనెల 15న బడుల్లో తరగతులు ప్రారంభమవుతాయి.