జాక్టో చైర్మెన్‌గా సదానందంగౌడ్‌, సెక్రెటరీ జనరల్‌గా కృష్ణుడు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) చైర్మెన్‌గా జి సదానందంగౌడ్‌, సెక్రెటరీ జనరల్‌గా కె కృష్ణుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఎస్టీయూ భవన్‌లో జాక్టో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జాక్టో కోశాధికారిగా జి హేమచంద్రుడు, ప్రచార కార్యదర్శిగా ఎండీ అబ్దుల్లా, కోచైర్మెన్లుగా ఎం రాధాకృష్ణ, డి వెంకటేశ్వరరావు, చైతన్య, జయబాబు, అంజయ్య, అలీబాబా, గౌరవ సలహాదారులుగా ఎం పర్వత్‌రెడ్డి, ఎం చెన్నయ్య, వేణుగోపాలస్వామి, మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో మూడింటిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని జాక్టో డిమాండ్‌ చేసింది. అన్ని రకాల పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని కోరింది. మండలంలోని సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో బాధ్యతలను అప్పగించాలని సూచించింది. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలనీ, పదోన్నతులు కల్పించాలని తెలిపింది. అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. పారిశుధ్య కార్మికుల వేతనాలు అమ్మ ఆదర్శ పాఠశాల అకౌంట్‌లో జమ చేయాలని కోరింది. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ను ఇవ్వాలని తెలిపింది.